BRS : ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలు సైలెంట్..?
BRS : గతంలో జిల్లాలో బలమైన ఆధిపత్యం కలిగిన ఈ పార్టీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది
- Author : Sudheer
Date : 03-02-2025 - 3:38 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత ఖమ్మం (Khammam) జిల్లాలో బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) నేతలు మౌనంగా ఉండిపోయారు. గతంలో జిల్లాలో బలమైన ఆధిపత్యం కలిగిన ఈ పార్టీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. దీంతో స్థానిక నేతలు ఇప్పటివరకు మళ్లీ ప్రజలతో కలవడానికి ముందుకు రావడం లేదు. అసలు జిల్లాలో బిఆర్ఎస్ అనేది ఉందా…? అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ క్యాడర్కు అందుబాటులో లేకపోవడంతో, కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలు బలహీనపడిపోవడంతో, బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకత్వం ఎటువైపుకు సాగుతుందో అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు.
Jimmy Carter : మాజీ దేశాధ్యక్షుడికి గ్రామీ అవార్డ్.. ఇంద్రానూయి సోదరికి కూడా..
గతంలో బలంగా ఉన్న ఖమ్మం జిల్లాలో ఇప్పుడు పార్టీ నాయకత్వం పూర్తిగా నిశ్శబ్దంగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలవుతుండగా, బీఆర్ఎస్ నేతలు ఇంకా ప్రజల దగ్గరకు వెళ్లేందుకు సిద్దపడలేకపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజల్లో తిరిగి మద్దతును ఎలా సంపాదించుకోవాలనే విషయంలో స్పష్టత లేకపోవడం పార్టీకి పెద్ద సవాలుగా మారింది. గెలిచిన ఇతర పార్టీల నేతలు తమ కార్యకలాపాలను మరింత బలపరుస్తుంటే, బీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి పుంజుకుంటుందా? లేక ఈ మౌనం ఇంకా కొనసాగుతుందా అనే ప్రశ్న రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ బీఆర్ఎస్ నేతలు ప్రజల వద్దకు వెళ్లి, కొత్త కార్యాచరణ రూపొందించుకుని పనిచేస్తే పార్టీకి మళ్లీ పునాదులు బలపడతాయనే విశ్లేషణలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో నెలకొన్న మౌనం, పార్టీ భవిష్యత్తుపై అనేక అనుమానాలను కలిగిస్తున్నది.