BJP : తెలంగాణలో బిజెపి మాస్టర్ స్కెచ్.. పవన్ కళ్యాణ్ సమేతంగా..
ఏపీలో తాజా పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీ ఎంతో ఉత్సాహంతో ఉత్తేజంతో ముందుకు సాగిపోతున్న ఈ తరుణంలో, ఆ పార్టీకి తెలంగాణలో కూడా తమ బలాన్ని నిరూపించుకోవాలన్న ఆలోచన వచ్చి ఉంటుంది.
- By Sudheer Published Date - 07:29 PM, Wed - 18 October 23
డా. ప్రసాదమూర్తి
రాజకీయాల్లో కళ్లకు కనిపించేదంతా నిజం కాదు. పుస్తకాల్లో బిట్వీన్ ది లైన్స్ ఉన్నట్లే, పాలిటిక్స్ లో బిట్వీన్ ది విజువల్స్ ఉంటాయి. కళ్ళుంటే చూడాలి. చూపుంటే అసలు విషయాన్ని పట్టుకోవాలి. తెలంగాణలో ఎన్నికలకు (Telangana Assembly Elections) ఇంకా దాదాపు 40 రోజులు సమయం ఉంది. ఇప్పటికే ప్రధాన పక్షాలు మూడూ మేమే గెలుపుగుర్రాలమని ఎవరికి వారే ప్రకటిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు 50 రోజులు ముందే అభ్యర్థుల జాబితాను విడుదల చేసి అధికార బీఆర్ఎస్ (BRS) యుద్ధ రచనలో తామెంత సన్నద్ధంగా ఉన్నారో చాటి చెప్పింది. కాంగ్రెస్ పార్టీ (Congress Party) తొలి జాబితా విడుదల చేసింది. మలి జాబితాకు పార్టీ లోపల మల్లయుద్ధమే జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఏ రాష్ట్రంలోనూ లేని సీనియర్ల ఇంటిపోరు తెలంగాణలో మెండుగా ఉందని చెప్పాలి. అసలే సీనియర్లు, అందులోనూ ఎన్నికలు. ఎవరినీ నొప్పించకుండా పార్టీ విజయానికి పక్కా వ్యూహాన్ని పన్నుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ముందుకు సాగడం కత్తి మీద సాము లాంటిదే. మరోపక్క బీజేపీ (BJP) కూడా అధికార బీఆర్ఎస్ కి ప్రధాన పోటీ తామేనని పైకి చెబుతోంది. అభ్యర్థుల ఖరారు విషయంలో బిజెపి కూడా బాగానే కుస్తీ పడుతోంది. ఇదంతా మనకు పైకి కనిపిస్తున్న దృశ్యం. పైకి వినిపిస్తున్న మాటల తీరు. కానీ తరచి చూస్తే వినిపించే మాటల వెనక, కనిపించే దృశ్యాల వెనుక నిగూఢమైన అర్థాలు మనకు బోధపడతాయి.
జనసేనాని పవన్ కళ్యాణ్ తో ఈరోజు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత లక్ష్మణ్ తో కలిసి భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఎప్పటినుంచో బిజెపితో తాను పొత్తులో ఉన్నట్టు చెబుతూ వస్తున్నారు. అది కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే అని ఇంతవరకూ అందరూ అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల బరిలో కూడా దిగబోతున్నారని ఇటీవలనే ఊహాగానాలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో 2019లో ఒక స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయారు. ఈసారి అక్కడ పార్టీ అవకాశాలు మెరుగైనట్టు జనసేన ఈసారి తప్పనిసరిగా కొన్ని అనూహ్యమైన విజయాలను సాధించవచ్చు అనే అంచనాలు పార్టీ కార్యకర్తల నుంచి, పవన్ కళ్యాణ్ నుంచి మాత్రమే కాక రాజకీయ విశ్లేషకుల నోట కూడా వినబడుతోంది. సరే ఇదంతా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన విషయం. పవన్ అక్కడ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే టిడిపి, జనసేన విజయం సాధించవచ్చు అని ఇప్పటికే ఆత్మసాక్షి సర్వే లాంటి కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఏపీలో తాజా పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీ ఎంతో ఉత్సాహంతో ఉత్తేజంతో ముందుకు సాగిపోతున్న ఈ తరుణంలో, ఆ పార్టీకి తెలంగాణలో కూడా తమ బలాన్ని నిరూపించుకోవాలన్న ఆలోచన వచ్చి ఉంటుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ఆలోచన జనసేనకు వచ్చినా రాకపోయినా, తెలంగాణలో ఎన్నికలకు తలపడుతున్న పార్టీలకు మాత్రం తప్పనిసరిగా వస్తుంది. అసలే తెలంగాణలో సెట్లర్ల ఓట్లు కీలకంగా భావిస్తూ, అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, మరోవైపు బిజెపి తమదైన శైలిలో స్థాయిలో రాజకీయ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆంధ్రా సెట్లర్ల ఓట్లు హైదరాబాదు, ఖమ్మం, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో గణనీయంగా ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత జగన్ పక్షం వారు, బాబు పక్షం వారు స్పష్టంగా విడిపోయిన ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. తెలంగాణలో బాబుకు మద్దతుగా భారీ ర్యాలీలు నిర్వహిస్తున్న ఐటీ ఉద్యోగుల ఉత్సాహం చూస్తూనే ఉన్నాం. దీన్నిబట్టి చంద్రబాబు మద్దతుదారులైన ఓటర్లు పవన్ కళ్యాణ్ కి కూడా మద్దతు పలికే అవకాశం ఉంటుంది. ఆంధ్రాలో పవన్ తెలుగుదేశంతో పొత్తు కొనసాగిస్తామని చెప్పారు కాబట్టి, ఆ మేరకు తెలంగాణలో సెట్లర్ల అభిప్రాయాల్లో మార్పు రావచ్చు.
ఒకవేళ కమ్మ సామాజిక వర్గం గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పనిచేయాలని నిర్ణయం తీసుకుంటే, ఆ ప్రభావం తెలంగాణలో భారీగా ఉంటుంది. ఆ సామాజిక వర్గంతో పాటు తెలుగుదేశానికి జనసేన పార్టీకి మద్దతు ఇచ్చే అన్ని వర్గాల వారూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తెలంగాణలో వైసిపి వ్యతిరేక ఆంధ్రా సెటిలర్ ఓటర్ల మద్దతు సంపూర్ణంగా ఎవరు పొందుతారో వారికి బలం చేకూరుతుంది.
ఇలాంటి వాతావరణంలో కాంగ్రెస్ వైపు టిడిపి, జనసేన మద్దతుదారులు వెళ్లకుండా అడ్డుకోవాలంటే వారిని దారి మరల్చాలి. ఇప్పటికే అధికార బి ఆర్ ఎస్ నాయకుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్, చంద్రబాబు మద్దతుగా సాగే ప్రదర్శనలను ర్యాలీలను అడ్డుకొని చంద్రబాబు పట్ల తమ వ్యతిరేక వైఖరిని ప్రదర్శించారు. కాబట్టి అధికార బీఆర్ఎస్ వైపు జనసేన, టిడిపి ఓటర్లు మొగ్గు చూపే అవకాశం లేదు. ఇక మిగిలిన ఏకైక రాస్తా బిజెపి మాత్రమే. మరి బిజెపి తెలంగాణలో అధికారంలోకి వచ్చేంతగా బలాన్ని పెంచుకుందా అంటే, ఏ ఎన్నికల సర్వేలోనూ రెండో స్థానం కూడా ఈ పార్టీకి దక్కడం లేదు. మరోవైపు బిజెపి, అధికార బీఆర్ఎస్ పైకి ఎంత గా ఒకరినొకరు తిట్టుకుంటున్నట్టు, కొట్టుకుంటున్నట్టు కనిపిస్తున్నా.. ఇద్దరి మధ్యా పరోక్షబంధం ఏదో ఉందనేదే కాంగ్రెస్ పార్టీతో సహా పలువురు అంచనా వేస్తున్నారు.
మరి ఇలాంటి రాజకీయ సరికొత్త సన్నివేశంలో బిజెపి సాగిస్తున్న ప్రయత్నాలను చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే నారా లోకేష్ అమిత్ షాను కలిశారు. కలయికకు అర్థం ఆయన పైకి ఏం చెప్పినా తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాన్ని చర్చించారని మాత్రం అందరూ భావిస్తున్నారు. అదిగో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో బిజెపి నాయకుల భేటీ కూడా ఈ వెలుగులోనే చూడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ వైపు టిడిపి, జనసేన మద్దతుదారుల ఓట్లు మళ్ళకుండా అడ్డుకట్ట వేయడానికి బీజేపీ నడుం కట్టుకుంది. అది బిజెపికి ఎంత ఫలిస్తుందో తెలియదు గానీ, తమ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ పార్టీకి వెళ్లకుండా మరో దారి పడితే అధికార బీఆర్ఎస్ కి అంతకు మించిన ఆనందం మరేం ఉంటుంది? ఇదే తెలంగాణలో అదృశ్యంగా బిజెపి వేసిన మాస్టర్ ప్లాన్ గా అర్థం చేసుకోవాల్సి ఉంటుందని పలువురు భావిస్తున్నారు.
అందుకే కనిపించేవన్నీ నిజం కాదు. కనిపించే వాటి నుంచి కనిపించవా కనిపించని వాటిని గమనించిన వాడే రాజకీయాలను అర్థం చేసుకోగలుగుతాడు. వైసీపీ మద్దతుదారుల ఓట్లు ఎలాగూ బీఆర్ఎస్ కి పడతాయి. కానీ వాటిలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కాంగ్రెస్ వైపు పోతాయని ఒక అంచనా. అందుకే మిగిలిన టిడిపి, జనసేన మద్దతుదారుల ఓట్లు చీల్చే ప్రయత్నంలో బిజెపి, జనసేనాని తో సమావేశాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలా బీఆర్ఎస్ కు కాగల కార్యాన్ని బిజెపి వారు తీర్చబోతున్నారా అన్న అనుమానాలు ఇప్పుడు రేకెత్తుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ప్రకటన ఎలా ఉంటుందో చూడాలి.
Read Also : Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ బీ రెడీ.. రెండు పండుగలు ఒకేసారి..!
Related News
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గెలిస్తే.. ఆమె భర్తకు ఆటో గిఫ్ట్ ఇస్తానంటున్న నిర్మాత..
పవన్ కళ్యాణ్ గెలిచిన తరువాత ఊరంతా పార్టీ ఇస్తానన్న మహిళ భర్తకు ఆటో గిఫ్ట్ ఇస్తానంటున్న నిర్మాత.