గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్.. హైకోర్టు సంచలనం
- Author : Vamsi Chowdary Korata
Date : 05-02-2026 - 12:15 IST
Published By : Hashtagu Telugu Desk
TGPSC Group 1 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షపై నెలకొన్న వివాదంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. ఈ రోజు ఉదయం వెలువరించిన తీర్పు ప్రకారం.. 2024 అక్టోబర్ లో జరిగిన మెయిన్స్ పరీక్షల్లో అవకతవకలు జరగాయన్న ఆరోపణలను తోసిపుచ్చింది. జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
దీంతో గ్రూప్ – 1 ఉద్యోగాలకు ఎంపికైన 562 మంది అభ్యర్థులకు ఊరట లభించింది. 2024 లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో మొత్తం 562 మంది అభ్యర్థులను టీజీపీఎస్సీ ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థులకు 2025 సెప్టెంబర్ 27న సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు.
ఏంటీ వివాదం..
టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, మార్కుల కేటాయింపులో పారదర్శకత లేదని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన సింగిల్ బెంచ్ జడ్జి.. గ్రూప్-1 మెయిన్స్ ర్యాంకింగ్ లను రద్దు చేశారు. జవాబుపత్రాలను రీ వాల్యుయేషన్ చేయాలని ఆదేశించారు. ఈ తీర్పుపై గ్రూప్ 1 కు ఎంపికైన అభ్యర్థులతో పాటు టీజీపీఎస్సీ కూడా హైకోర్టులో అప్పీల్ చేసింది.