Bandi Sanjay: ‘తెలంగాణ’లోనూ రాబోయేది ‘బీజేపీ’ ప్రభుత్వమే – ‘బండి సంజయ్’
ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణలోనూ రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
- By Hashtag U Published Date - 08:53 PM, Thu - 10 March 22
ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణలోనూ రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారని, ఐదు రాష్రాల ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం బండి సంజయ్ కుమార్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్, మాజీ అధ్యక్షులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, యువ, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్, గీతామూర్తి, రాష్ట్ర నాయకులు సీహెచ్.విఠల్, గూడూరు నారాయణరెడ్డి, జె.సంగప్ప, ఆకుల విజయ, డాక్టర్ పద్మ ఉమారాణి, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ….. 5 రాష్ట్రాల్లో ఓట్లేసిన ప్రజలకు, 4 రాష్ట్రాల్లో బీజేపీని గెలిపించిన వారందరికీ పార్టీ రాష్ట్ర శాఖ తరపున ధన్యవాదాలు. నరేంద్రమోదీ, అమిత్ షా, జేపీ నడ్డా లకు ప్రత్యేక క్రుతజ్ఝతలు. ఫలితాలు చూసిన తరువాత కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ఉత్సవాలు చేసుకున్నారు. ఎన్నికలకు ముందు, తరువాత కూడా చాలా సర్వే సంస్థలు, ప్రత్యర్ధి పార్టీలు బీజేపీ పనైపోయిందని చేసిన ప్రచారం తలకిందులైంది. 37 ఏళ్ల చరిత్రను తిరగరాసిన ఘనత యోగీ సర్కార్ దే. గూండారాజ్, మాఫియా రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించిన ఘనత యోగిదే అని బండి సంజయ్ అన్నారు. దేశవ్యాప్తంగా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ప్రజలు మరోసారి నిరూపించారు. అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా మోదీ పాలన కొనసాగుతోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ప్రజలు ఆశిస్తున్నారు. తెలంగాణలో కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నారు.
కేంద్ర సంక్షేమ పథకాలను నీరు గారుస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించడం లేదు. రాష్ట్ర వాటాను ఖర్చు చేయడం లేదని కేసీఆర్ సర్కార్ పై బండి సంజయ్ మండిపడ్డారు.
సిగ్గుతో తలదించుకోవాల్సిన కేసీఆర్ ఫ్రభుత్వం మళ్లీ కేంద్రంపైనే దుష్ప్రచారం చేస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ బూచితో రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని వెల్లడించారు. 2014 నుండి తెలంగాణలో బీజేపీ ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తోంది. గత ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఇక్కడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ఇంజన్ దారుస్సలాంకు తాకట్టు పెట్టారు. ఇంజన్ లేని సర్కార్ ముందుకు సాగదు. 4 రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాల స్పూర్తితో తెలంగాణలోనూ అధికారాన్ని కైవసం చేసుకుటాం. గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తాం అని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇక విలేకరులు అడిగిన ప్రశ్నలకు బండి సంజయ్ తనదైన శైలిలో స్పందించారు.
చెల్లని రూపాయికి గీతలెక్కువ. కేసీఆర్ కు కోతలెక్కువ. దేశం మొత్తం తిరిగి టెంట్, ఫ్రంట్ పెడతానన్న కేసీఆర్… 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారానికి ఎందుకు వెళ్లలేదు? ఆయనను ఎవరూ ఎందుకు పిలవలేదు? కేసీఆర్ పై ప్రజలకు నమ్మకం పోయింది. లీడర్లకు ఆయన సంగతి బాగా తెలుసు. అందుకే ఎవరూ పిలవడం లేదని బండి సంజయ్ అన్నారు.
కేసీఆర్ అవినీతి-నియంత-కుటుంబ పాలన పట్ల తెలంగాణ జనం విసిగిపోయారు. సరైన సమయంలో వాత పెట్టబోతున్నారు. ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటన విహార యాత్రలుగానే మిగిలిపోతాయి. టైం పాస్ యాత్రలే తప్ప ఆయనను రమ్మన పిలిచిన నాయకులు ఒక్కరూ లేరు.
నిరుద్యోగ సమస్యపై బీజేపీ చేసిన ఉద్యమాల సెగ తాకడంతోనే సీఎం భయపడి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్లీ ఇతరుల పేరుతో కోర్టులో కేసులు వేయించి ఉద్యోగాల నోటిఫికేషన్ ఆగిపోయేలా చేసి జాప్యం చేయాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. కేసీఆర్ కు చిత్తశుద్ది ఉంటే… ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు మళ్లీ ఎన్నికల్లోకి వెళ్లబోమని హామీ ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేటీఆర్… ఓ డ్రామా రావు. ఆయన మాటలు పట్టించుకునేదెవరు?కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం. అతి త్వరలో మీరే చూడబోతున్నారు. మాకంటే ప్రజలకు, మీకే (మీడియా) కేసీఆర్ లాంటి అవినీతి పరుడిని జైల్లో వేయాలని ఉత్సాహపడుతున్నారు. సరైన సమయంలో జైలుకు పోవడం ఖాయమని చెప్పారు. ఇక పార్టీలోకి ఎవరో వస్తారని మేం ఎదురు చూడం. పార్టీ సిద్ధాంతాలు, నరేంద్రమోదీ నాయకత్వాన్ని సమర్ధించే వాళ్లను మాత్రమే పార్టీలోకి వస్తానంటే స్వాగతిస్తాం.
తెలంగాణపై జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. అమిత్ షా, జేపీ నడ్డా రాష్ర్టానికి వస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారని పేర్కొన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
Related News
Telangana Elections : 17 లోక్సభ స్థానాల్లో 525 మంది అభ్యర్థులు : సీఈఓ వికాస్ రాజ్
Telangana Elections : తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఏర్పాట్లపై కీలక వివరాలను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) వికాస్ రాజ్ మీడియాకు వెల్లడించారు.