Bhu Bharati Bill : భూ భారతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లుని సభ ఆమోదించింది. ఇక ప్రస్తుతం ఉన్న ధరణి రికార్డులను ప్రభుత్వం పూర్తిగా ప్రక్షాళన చేయనుంది.
- By Latha Suma Published Date - 05:44 PM, Fri - 20 December 24

Bhu Bharati Bill : తెలంగాణ శాసన సభ భూభారతి బిల్లుకు తెలిపింది. భూ సమస్యల నివారణకు ప్రభుత్వం ఈ నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్నఆర్వోఆర్-2020ను స్ధానంలో కొత్తగా భూభారతి బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్వోఆర్-2020ను రద్దు చేసి దాని స్థానంలో భూభారతి పేరుతో తీసుకొచ్చిన బిల్లును మంత్రి సభ ముందు ఉంచారు. దీనికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆమోదించారు. ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లుని సభ ఆమోదించింది. ఇక ప్రస్తుతం ఉన్న ధరణి రికార్డులను ప్రభుత్వం పూర్తిగా ప్రక్షాళన చేయనుంది. కొత్త చట్టం కింద రికార్డులను నమోదు చేస్తారు. గతంలో రద్దు చేసిన అనుభవదారుడి కాలమ్ ను మళ్లీ తీసుకురానున్నారు.
అంతకుముందు.. భూమి పేదరికాన్ని దూరం చేసి ఆత్మగౌరవంతో జీవించేలా చేస్తుందని.. గ్రామాల్లో భూమి ప్రధాన జీవన ఆధారమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కష్టజీవులను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత ప్రభుత్వాలదని చెప్పారు. దీని ద్వారా చాలామంది రైతులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుందని తెలిపారు. ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ వల్ల ఏం ప్రయోజనం ఉండదన్నారు.ధరణిలో అక్రమాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ చేయించాలి అని పొంగులేటి అన్నారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.
కాగా, భూ భారతితో ఎవరైనా ఎక్కడి నుంచైనా భూముల వివరాలను చూసుకునేలా డిస్ప్లే చేస్తారు. గతంలో ఉన్న 33 మూడ్యూళ్లు కాకుండా.. ఆరు మాడ్యూళ్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రతి భూకమతానికి భూ ఆధార్ ఉండనుంది. హక్కుల బదలాయింపు జరగ్గానే గ్రామ పహాణీలో నమోదయ్యేలా చర్యలు తీసుకుంటారు. 2014 జూన్ 2 ముందుకు జరిగిన సాదా బైనామాలను కూడా క్రమబద్ధీకరించనున్నారు. భూ సమస్యలు ఉన్న రైతులకు ఉచితంగా న్యాయ సలహాలు ఇచ్చేలా కొత్త చట్టంలో రూపకల్పన చేశారు.
Read Also: E Car Race Case : కేటీఆర్ కు ఊరట