Incharge VCs : పది యూనివర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలు.. ఐఏఎస్లకు బాధ్యతలు
తెలంగాణలోని యూనివర్సిటీల వీసీల పదవీకాలం నేటితో ముగిసింది.
- Author : Pasha
Date : 21-05-2024 - 5:09 IST
Published By : Hashtagu Telugu Desk
Incharge VCs : తెలంగాణలోని యూనివర్సిటీల వీసీల పదవీకాలం నేటితో ముగిసింది. దీంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పది విశ్వవిద్యాలయాలకు ఇన్ఛార్జి వైస్ ఛాన్స్లర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూనివర్సిటీల ఇన్ఛార్జిలుగా ఐఏఎస్ అధికారులను అపాయింట్ చేశారు. కొత్త వీసీలను నియమించే వరకు వీరే ఇన్ఛార్జి వీసీలుగా బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని యూనివర్సిటీలకు కొత్త వీసీలను ఎంపిక చేసేందుకు అన్ని వర్సిటీల పరిధిలో సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేశారు. అవి పంపించే జాబితాలను పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వీసీల నియామకంపై నిర్ణయాన్ని తీసుకోనుంది.
We’re now on WhatsApp. Click to Join
యూనివర్సిటీ – ఇన్ఛార్జి వీసీ
- ఉస్మానియా : దాన కిషోర్
- జేఎన్టీయూ : బుర్రా వెంకటేశం
- కాకతీయ : వాకాటి కరుణ
- అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ : రిజ్వి
- తెలంగాణ వర్సిటీ : సందీప్ కుమార్ సుల్తానియా
- పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ : శైలజా రామయ్యర్
- మహాత్మాగాంధీ వర్సిటీ : నవీన్ మిట్టల్
- శాతవాహన వర్సిటీ : సురేంద్రమోహన్
- జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ : జయేష్ రంజన్
- పాలమూరు యూనివర్సిటీ : నదీం అహ్మద్
Also Read :Prashant Kishore : బీజేపీకి సీట్లు అస్సలు తగ్గవు.. జగన్కు ఓటమి ఖాయం : పీకే
రాష్ట్రంలోని యూనివర్సిటీల వీసీల ఎంపికకు ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వీసీ పోస్టులకు మొత్తం 312 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకోగా, అన్ని యూనివర్సిటీల నుంచి మొత్తం 1,382 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించి వీసీల(Incharge VCs) పేర్లను సిఫారసు చేసేందుకు సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో వీసీల నియామకంలో కొంత జాప్యం జరిగింది. ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకున్న ప్రభుత్వం నాలుగు రోజుల క్రితమే వీసీల ఎంపిక కోసం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. కానీ ఇంకా కమిటీల సమావేశాలు జరగలేదు. దీంతో కొత్త వీసీల నియామకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే తాత్కాలికంగా యూనివర్సిటీలకు ఇన్ఛార్జిలను నియమించారు. కాగా, పదవీకాలం ముగియడంతో పలు యూనివర్సిటీల వీసీలు హడావుడిగా బిల్లులను క్లియర్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత మూడేళ్లుగా కొనసాగుతున్న వీసీలు తమ పదవీకాలం చివరి దశలో ఇలా పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉస్మానియా, జేఎన్ఏఎఫ్ఏ వంటి పలు యూనివర్సిటీలు రూ.కోట్లలో పాత బిల్లులు చెల్లించాయి.