Amberpet CI Sudhakar: అంబర్పేట సీఐ సుధాకర్ కు బెయిల్ మంజూరు
భూ మోసం కేసులో అరెస్టయిన అంబర్పేట సీఐ సుధాకర్ (Amberpet CI Sudhakar)కు హయత్ నగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భూమి ఇస్తానని మోసం చేసిన కేసులో అరెస్టయిన సీఐ సుధాకర్ను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
- Author : Gopichand
Date : 14-01-2023 - 8:55 IST
Published By : Hashtagu Telugu Desk
భూ మోసం కేసులో అరెస్టయిన అంబర్పేట సీఐ సుధాకర్ (Amberpet CI Sudhakar)కు హయత్ నగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భూమి ఇస్తానని మోసం చేసిన కేసులో అరెస్టయిన సీఐ సుధాకర్ను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనాథ్ కుమార్ అనే వ్యక్తిని భూముల వ్యవహారంలో మోసం చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో అంబర్ పేట సీఐ సుధాకర్ ను వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి హయత్ నగర్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సీఐ సుధాకర్, ఆర్ఐ రాజేష్పై వనస్థలిపురం పోలీస్స్టేషన్లో రెండ్రోజుల క్రితం కేసు నమోదైంది. తమకు భూమి ఇప్పిస్తానని ఆర్ఐ రాజేష్ రూ.50 లక్షలు తీసుకున్నాడని బాధితుడు ఎన్నారై ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Also Read: Gold Price Today: పండగ పూట బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా.. అయితే ధరలు ఇవే..!
తాను చెప్పిన ప్రదేశంలో భూమిని కొంటే, భవిష్యత్తులో దాని విలువ మరింత పెరుగుతుందని సీఐ ఆ ఎన్నారైని ఒత్తిడి చేసినట్టు తెలిసింది. ఓ నకిలీ ఎమ్మార్వోను రంగంలోకి దింపి, అతడు త్వరలోనే ఆర్డీవో అవుతాడంటూ ఆ ఎన్నారైకి నమ్మకం కలిగించేందుకు ప్రయత్నించినట్టు వెల్లడైంది. రూ.54 లక్షలు తీసుకున్న తర్వాత, సీఐ తదితరులు మొహం చాటేశారని, భూమి ఇప్పించకుండా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా వేధించారని ఆ ఎన్నారై తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. డబ్బులు తీసుకుని నెలల తరబడి భూమి ఇవ్వకపోవడంతో బాధితుడు వనస్థలిపురం పీఎస్లో ఫిర్యాదు చేశాడు.
పలు ఆరోపణలతో సస్పెన్షన్కు గురైన ఆర్ఐ రాజేష్ ఎమ్మార్వో పేరుతో నకిలీ ఐడీ కార్డును సృష్టించి పదోన్నతుల ద్వారా త్వరలో ఆర్డీఓ అవుతానని బాధితులను నమ్మించాడు. ఆ తర్వాత తాను తీసుకున్న డబ్బును సీఐ సుధాకర్కు ఇచ్చాడని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కందుకూరు మండలంలోని ఓ గ్రామంలో వ్యవసాయ భూమిని అమ్మేందుకు డబ్బులు తీసుకున్నా.. నెలలు గడుస్తున్నా భూమికి రిజిస్ట్రేషన్ చేయలేదు. మోసపోయానని గ్రహించిన బాధితుడు వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించాడు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు ఫిర్యాదు చేశారు.