Kims Hospital : శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అరవింద్
Kims Hospital : శ్రీతేజ్ ఆరోగ్యం గురించి ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాలుడి కుటుంబసభ్యులను ఆత్మీయంగా పరామర్శించిన ఆయన, అవసరమైన అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
- Author : Sudheer
Date : 18-12-2024 - 7:18 IST
Published By : Hashtagu Telugu Desk
సంధ్య థియేటర్ తొక్కిసలాట (Sandhya Theater Stampede) లో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్(Sritej)ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్యం గురించి ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాలుడి కుటుంబసభ్యులను ఆత్మీయంగా పరామర్శించిన ఆయన, అవసరమైన అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రి(Kims Hospital)లో శ్రీతేజ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. డాక్టర్లు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. అతడి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, వెంటిలేటర్పైనే ఉంచినట్లు తెలిపారు. మెదడుకు ఆక్సిజన్ సరఫరా పూర్తిగా సక్రమంగా ఉండడం లేదని వైద్యులు తెలిపారు. ట్యూబ్ ద్వారా ఆహారం అందించడంతో పాటు అతడిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.
శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై అల్లు అర్జున్ ఇటీవల ఓ వీడియో ద్వారా తన బాధను వ్యక్తం చేశారు. కేసు కోర్టులో కొనసాగుతున్న కారణంగా శ్రీతేజ్ను కలవలేకపోతున్నానని, కానీ అతడి కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు. త్వరగా శ్రీతేజ్ ఆరోగ్యం కుదుటపడాలని ఆకాంక్షించిన అల్లు అర్జున్, త్వరలోనే బాధిత కుటుంబాన్ని కలుస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ రూ.25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. చికిత్సకు అవసరమైన మొత్తం ఖర్చులు భరిస్తానని స్పష్టంగా తెలియజేశారు. వారి కుటుంబానికి అన్ని విధాలా మద్దతుగా నిలబడతానని పేర్కొన్నారు. మరోపక్క తొక్కిసలాట ఘటనకు సంబదించిన కేసులో అల్లు అర్జున్పై పోలీసులు కేసు నమోదు చేయడం, ఈ నెల 13న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చంచల్గూడ జైలులో ఒక రాత్రి గడిపిన అల్లు అర్జున్ హైకోర్టు మధ్యంతర బెయిల్ ద్వారా బయటకు వచ్చారు.
Read Also : Bhuvanagiri : విద్యార్థినితో వంట చేయించిన ప్రిన్సిపాల్.. నూనె పడి గాయాలు