ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్ పై ఏసీబీ సోదాలు
- Author : Vamsi Chowdary Korata
Date : 09-06-2026 - 3:55 IST
Published By : Hashtagu Telugu Desk
Mohan Naik ఆర్అండ్బీ ఈఎన్సీ అవినీతి చిట్టా బయటపడింది. హైదరాబాద్లో ఏసీబీ అధికారులు 11 ప్రాంతాల్లో 16 బృందాలతో ఏకకాలంలో సోదాలు నిర్వహించగా.. భారీ అవినీతి బాగోతం బయటపడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులకు రూ.60 లక్షల నగదు దొరికింది. అంతేకాకుండా 3 కిలోల బంగారం, మద్యం సీసాలు లభించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. మోహన్ నాయక్ మొత్తం ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
హైదరాబాద్ మాదాపూర్లోని రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ మోహన్ నాయక్ ఇళ్లు, ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో.. మోహన్ నాయక్ ఇంటితోపాటు.. ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల నివాసాలు కలిపి.. 11 ఇతర ప్రాంతాల్లో ఏకంగా 16 ఏసీబీ టీంలు ఒకేసారి తనిఖీలు నిర్వహించాయి. తెల్లవారుజామునే తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా నగదు, బంగారం, మద్యం బాటిళ్లు దొరికినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఇక ఇప్పటివరకు బయటపడ్డ వివరాల ప్రకారం.. ఆయన ఆస్తులు మొత్తం రూ.100 కోట్లకు పైనే ఉంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇప్పటిదాకా.. రూ.60 లక్షల నగదు, 3 కిలోల బంగారం, 35 మద్యం సీసాలు, భారీగా ఆస్తి పత్రాలు లభించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. అందులో 15 బంగారు బిస్కెట్లు కూడా ఉన్నట్లు తెలిపారు. వీటితోపాటు హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువైన వ్యవసాయ భూములు ఉన్నాయని.. వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పేపర్లను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మోహన్ నాయక్ అక్రమాస్తులపై 16 ఏసీబీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయని వివరించారు. సాయంత్రం వరకు మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.
2025 సెప్టెంబర్లో ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ)గా మోహన్ నాయక్ పదవిలోకి వచ్చారు. అంతకుముందు స్టేట్ రోడ్స్ చీఫ్ ఇంజినీర్గా, ఆర్డీసీ (రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఎండీగా మోహన్ నాయక్ పలు విభాగాల్లో విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం మోహన్ నాయక్కు ఈఎన్సీగా పదోన్నతి ఇచ్చింది. అయితే.. ఆర్ అండ్ బీ ఈఎన్సీగా బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా గడవకముందే మోహన్ నాయక్పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి.. మోహన్ నాయక్ అవినీతి చిట్టాను బయటపెట్టారు.
తన హోదాను అడ్డం పెట్టుకుని ఆర్అండ్బీ శాఖలో టెండర్లు, కాంట్రాక్టుల కేటాయింపుల్లో మోహన్ నాయక్ భారీ ఎత్తున అవినీతి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల రూపంలో భారీగా డబ్బులు తీసుకున్నట్లు చాలా రోజులుగా ఆరోపణలు ఉన్నాయని డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మోహన్ నాయక్ ఆర్థిక లావాదేవీలపై రహస్య నిఘా పెట్టి.. పక్కా సమాచారంతోనే దాడులు చేసినట్లు పేర్కొన్నారు.