Junior Civil Judge Posts : 150 జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Junior Civil Judge Posts : 150 జూనియర్ సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేసేందుకు హైదరాబాద్లోని తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ను విడుదల చేసింది.
- By Pasha Published Date - 09:33 AM, Sat - 27 April 24

Junior Civil Judge Posts : 150 జూనియర్ సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేసేందుకు హైదరాబాద్లోని తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 31 ఖాళీలు, బదిలీల ద్వారా 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ (ఫ్యూచర్/ యాంటిసిపేటెడ్) ద్వారా 90 పోస్టులు, ట్రాన్స్ఫర్ (ఫ్యూచర్/ యాంటిసిపేటెడ్) ద్వారా 14 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. బ్యాచిలర్స్ లా డిగ్రీ చేసి, మూడేళ్ల పాటు అడ్వకేట్ లేదా ప్లీడర్గా ప్రాక్టీస్ చేసినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. 2024 ఏప్రిల్ 10 నాటికి 23 నుంచి 35 ఏళ్లలోపు వయసున్న వారు అప్లై చేసేందుకు అర్హులు. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలలో పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఉద్యోగాలకు(Junior Civil Judge Posts) ఎంపికయ్యే వారికి ప్రతినెలా రూ.77,840 నుంచి రూ.1,36,520 జీతభత్యాలు అందుతాయి. మే 17లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే చాలు. స్క్రీనింగ్ టెస్ట్కు సంబంధించిన హాల్టికెట్ డౌన్లోడ్ ప్రక్రియ జూన్ 8 నుంచి ప్రారంభం అవుతుంది. కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ పరీక్ష జూన్ 16న జరుగుతుంది.
We’re now on WhatsApp. Click to Join
- 100 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. ఈ పరీక్షలో 40 శాతం లేదా ఆపై మార్కులు సాధించిన అభ్యర్థుల్లో 1:10 నిష్పత్తిలో రాతపరీక్షకు ఎంపికవుతారు.
- రాతపరీక్షలో మూడు పేపర్లు (సివిల్ లా, క్రిమినల్ లా, ఇంగ్లిష్ ట్రాన్స్లేషన్) ఉంటాయి. ఒక్కో పేపరుకు 100 మార్కుల చొప్పున, మూడు పేపర్లుకు 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్ ట్రాన్స్లేషన్ పేపర్లో 25 మార్కులకు ట్రాన్స్లేషన్, 75 మార్కులు ఎస్సే రైటింగ్ ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లిష్లోకి వ్యాసాలు రాయాల్సి ఉంటుంది.
- రాతపరీక్షలో కనీస అర్హత మార్కులను ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 60 శాతంగా (ఒక్కో పేపరులో కనీసం 55 శాతం మార్కులు), బీసీలకు 55 శాతంగా (ఒక్కో పేపరులో కనీసం 50 శాతం మార్కులు), ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 50 శాతంగా (ఒక్కో పేపరులో కనీసం 45 శాతం మార్కులు) నిర్ణయించారు.
- మొత్తం 30 మార్కులకు వైవా-వాయిస్ టెస్ట్ నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి 1:3 నిష్పత్తిలో వైవా-వాయిస్కు ఎంపికచేస్తారు. అర్హత మార్కులుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 40 శాతం మార్కులు, ఇతరులు 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.