ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో కొత్తగా 13 బస్స్టేషన్లు, 2 డిపోలు
'మహాలక్ష్మి' పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరగడంతో, దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా 13 ఆధునిక బస్ స్టేషన్లు మరియు 2 కొత్త బస్ డిపోల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది
- Author : Sudheer
Date : 04-02-2026 - 11:15 IST
Published By : Hashtagu Telugu Desk
New Bus Stations in Telangana : తెలంగాణ ప్రభుత్వం ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా భారీ అడుగులు వేస్తోంది. ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరగడంతో, దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా 13 ఆధునిక బస్ స్టేషన్లు మరియు 2 కొత్త బస్ డిపోల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 5 బస్ స్టేషన్ల పనులు ప్రారంభం కాగా, మిగిలినవి టెండర్ల దశలో ఉన్నాయి. అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న ఈ కేంద్రాలు అందుబాటులోకి వస్తే ప్రయాణికుల వేచి ఉండే సమయం తగ్గడమే కాకుండా, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.
ముఖ్యంగా జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో రూ.11.01 కోట్లతో కొత్త బస్ డిపో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ పాత నిర్మాణాలను తొలగించి యార్డు లెవెలింగ్ పనులు నిర్వహిస్తున్నారు. మరోవైపు, ములుగు జిల్లా ఏటూరునాగారంలో రూ.5.91 కోట్లతో నిర్మిస్తున్న డిపో ఈ ఏడాది అక్టోబరు నాటికి అందుబాటులోకి రానుంది. ఈ డిపో ఏర్పాటుతో పర్యాటక ప్రాంతాలైన మేడారం, బొగత జలపాతం, లక్నవరం వంటి ప్రదేశాలకు వెళ్లే యాత్రికులకు బస్సు సౌకర్యాలు మరింత మెరుగుపడతాయి. 3.79 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ డిపో ఉత్తర తెలంగాణ రవాణా ముఖచిత్రాన్ని మార్చనుంది.
జిల్లాలు మరియు పట్టణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఆధునిక బస్ స్టేషన్ల జాబితాలో కోదాడ, హుజూర్నగర్, నిజామాబాద్, మహబూబ్నగర్ వంటి ప్రధాన ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న కోదాడ బస్ స్టేషన్ను రూ.16.89 కోట్లతో భారీ స్థాయిలో అభివృద్ధి చేయాలని టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) లక్ష్యంగా పెట్టుకుంది. వేములవాడ, కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలతో పాటు మంథని, మధిర, నాగర్కర్నూల్ వంటి పట్టణాల్లో కూడా ప్రయాణికులకు సకల వసతులు కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే రాష్ట్రవ్యాప్తంగా కనెక్టివిటీ పెరగడమే కాకుండా, మారుమూల గ్రామాల నుంచి పట్టణాలకు బస్సు సర్వీసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.