WTC Final Day 2: రెండోరోజూ ఆసీస్ దే.. బ్యాట్లెత్తేసిన భారత్ స్టార్ ప్లేయర్స్..!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో (WTC Final Day 2) భారత్ ఎదురీదుతోంది. ఇటు బౌలింగ్ లోనూ, అటు బ్యాటింగ్ లోనూ నిరాశ పరిచిన వేళ రెండోరోజూ ఆస్ట్రేలియాదే పై చేయిగా నిలిచింది.
- Author : Naresh Kumar
Date : 08-06-2023 - 11:00 IST
Published By : Hashtagu Telugu Desk
WTC Final Day 2: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో (WTC Final Day 2) భారత్ ఎదురీదుతోంది. ఇటు బౌలింగ్ లోనూ, అటు బ్యాటింగ్ లోనూ నిరాశ పరిచిన వేళ రెండోరోజూ ఆస్ట్రేలియాదే పై చేయిగా నిలిచింది. హెడ్ సెంచరీ, స్మిత్ హాఫ్ సెంచరీతో భారీస్కోరుపై కన్నేసిన ఆసీస్ రెండోరోజు తొలి సెషన్ నుంచే వేగంగా ఆడింది. హెడ్ , స్మిత్ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు చాలా శ్రమించాల్సి వచ్చింది. వన్డే తరహా బ్యాటింగ్ తో అదరగొట్టిన హెడ్ 25 ఫోర్లు, 1 సిక్సర్ తో 163 పరుగులు చేశాడు.
అటు నిదానంగా ఆడిన స్మిత్ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి ఓవర్లోనే స్మిత్ వరుసగా రెండు బౌండరీలు బాది 229 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. ఆ వెంటనే ట్రావిస్ హెడ్ 164 బంతుల్లో 150 పరుగులు చేసుకున్నాడు. కామెరూన్ గ్రీన్ తో పాటు లోయర్ ఆర్డర్ విఫలమైనా.. ఆసీస్ ఇన్నింగ్స్ చివర్లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ ధాటిగా ఆడాడు. 7 ఫోర్లు , 1 సిక్సర్ తో 48 పరుగులు చేశాడు. అయితే రెండో సెషన్ తర్వాత భారత బౌలర్లు పుంజుకుని వరుసగా కీలక వికెట్ లను పడగొట్టారు.
Also Read: WTC Final 2023: వారెవ్వా అక్షర్.. వాట్ ఏ త్రో
దీంతో ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌటవగా.. భారత బౌలర్లలో సిరాజ్ 4 , షమీ 2 , ఠాకూర్ 2, జడేజా 1 వికెట్ పడగొట్టారు. చివర్లో భారత బౌలర్లు పుంజుకోకుంటే ఆసీస్ స్కోర్ 500 దాటేది. ఇదిలా ఉంటే తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ బ్యాటింగ్ తడబడుతూ సాగింది. ధాటిగా ఆడే క్రమంలో రోహిత్ శర్మ, గిల్ వెంటవెంటనే ఔటవడం, తర్వాత అంచనాలు పెట్టుకున్న పుజారా, కోహ్లీ నిరాశపరచడంతో టీమిండియా కేవలం 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో రహానే, జడేజా ఆదుకున్నారు. వీరిద్దరూ 71 పరుగులు జోడించారు. 48 రన్స్ చేసిన జడేజా ల్యాన్ బౌలింగ్ లో ఔటవడంతో 5వ వికెట్ చేజార్చుకుంది. తర్వాత శ్రీకర్ భరత్ , రహానే మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. దీంతో భారత్ రెండోరోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. రహానే 29 , శ్రీకర్ భరత్ 5 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం 318 పరుగులు వెనుకబడి ఉన్న టీమిండియా మూడోరోజు ఎలా ఆడుతుందో చూడాలి. బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై రహానే కీలక ఇన్నింగ్స్ ఆడితే ఈ మ్యాచ్ లో భారత్ గట్టెక్కినట్టే.