Retirement: ఆసియా కప్ కి ముందు శ్రీలంక క్రికెట్ జట్టుకి షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..!
శ్రీలంక క్రికెట్ జట్టు వెటరన్ ఆటగాడు లాహిరు తిరిమన్నె (Thirimanne) ఆసియా కప్ 2023కి ముందు అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ (Retirement) ప్రకటించాడు.
- By Gopichand Published Date - 03:43 PM, Sat - 22 July 23

Retirement: శ్రీలంక క్రికెట్ జట్టు వెటరన్ ఆటగాడు లాహిరు తిరిమన్నె (Thirimanne) ఆసియా కప్ 2023కి ముందు అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ (Retirement) ప్రకటించాడు. తన రిటైర్మెంట్ గురించి తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తిరిమన్నె తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ను గతేడాది మార్చిలో ఆడాడు. శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టు తరపున 197 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన లాహిరు గత ఏడాది భారత్తో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి అతను జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 33 ఏళ్ల లాహిరుకు 127 వన్డేలు ఆడిన అనుభవం ఉంది. రాబోయే ఆసియా కప్ కూడా వన్డే ఫార్మాట్లోనే జరగనుంది. లాహిరు తన చివరి వన్డే 2019లో ఆడాడు.
లాహిరు తన ప్రకటనలో మాట్లాడుతూ.. చాలా సంవత్సరాలుగా నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం. సంవత్సరాలుగా ఈ క్రీడ నాకు చాలా ఇచ్చింది. కానీ చాలా మిశ్రమ భావాలతో, నేను తక్షణమే అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నాను అన్నాడు. లాహిరు తిరిమన్నె 2010లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతను మూడు ఫార్మాట్లలో శ్రీలంక క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
Also Read: Sunrisers Hyderabad: SRH హెడ్కోచ్గా సెహ్వాగ్ ?
2010లో ODI అరంగేట్రం తర్వాత అతను 2011-12లో వరుసగా టెస్ట్, T20 ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. లాహిరు 44 టెస్టు మ్యాచ్ల్లో 85 ఇన్నింగ్స్ల్లో 2088 పరుగులు చేశాడు. అతను 127 ODIలు ఆడాడు. అందులో 3194 పరుగులు చేశాడు. వన్డేల్లో 4 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు చేశాడు. 26 టీ20 మ్యాచ్ల్లో 291 పరుగులు చేసిన లాహిరు ఈ ఫార్మాట్లో హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అతను తన చివరి టెస్టు మ్యాచ్ను మార్చి 2022లో భారత్తో ఆడాడు.