Women Asia Cup 2024: మహిళల ఆసియాకప్ లో భారత్ జోరు యూఏఈపై ఘనవిజయం
భారత్ యూఏఈపై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత మహిళల జట్టు 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ చేయగా... చివర్లో రిఛా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్ తో విరుచుకుపడింది
- By Praveen Aluthuru Published Date - 06:29 PM, Sun - 21 July 24

Women Asia Cup 2024: ఆసియా కప్ లో భారత మహిళల జట్టు దుమ్మురేపుతోంది. తొలి మ్యాచ్ లో పాక్ ను చిత్తు చేసిన భారత్ తాజాగా యూఏఈపై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత మహిళల జట్టు 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ చేయగా… చివర్లో రిఛా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్ తో విరుచుకుపడింది. ఈ క్రమంలో 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రిచా ఘోష్ జట్టు స్కోర్ను 200 ధాటించింది. చివరి ఓవర్లో హర్మన్ ప్రీత్ కౌర్ రనౌటైనా.. పూజావస్త్రాకర్ సాయంతో చివరి 5 బంతుల్లో 20 పరుగులు రాబట్టింది. చివరి 5 బంతులను వరుసగా బౌండరీ కొట్టింది. రిఛాకు అంతర్జాతీయ టీ20ల్లో ఇదే తొలి హాఫ్ సెంచరీ.
యూఏఈ బౌలర్లను ఆటాడుకున్న రిఛా ఘోష్ కేవలం 29 బంతుల్లోనే 12 ఫోర్లు, 1 సిక్సర్ తో 64 పరుగులు చేసింది. హర్మన్ ప్రీత్ 66 పరుగులు చేయగా…అంతర్జాతీయ టీ ట్వంటీల్లో 200 ప్లస్ స్కోర్ చేయడం భారత్ కు ఇదే తొలిసారి. తర్వాత బౌలింగ్ లోనూ అదరగొట్టిన భారత్ యూఏఈని 123 పరుగులకే పరిమితం చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లు తీయగా.. పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా, రేణుకా సింగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ టోర్నీలో భారత మహిళల జట్టుకు ఇది వరుసగా రెండో విజయం.