Rishabh Pant: యువ వికెట్ కీపర్ పై గవాస్కర్ ఫైర్
(Image Credit : AFP) టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సౌతాఫ్రికా గడ్డపై బ్యాట్ పరంగా విఫలమవుతున్నాడు. రెండు టెస్టుల్లోనూ ఏ మాత్రం ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు.
- By Hashtag U Published Date - 05:21 PM, Wed - 5 January 22
టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సౌతాఫ్రికా గడ్డపై బ్యాట్ పరంగా విఫలమవుతున్నాడు. రెండు టెస్టుల్లోనూ ఏ మాత్రం ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో అతని బ్యాటింగ్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పంత్ పై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశాడు. కాస్త బాధ్యతగా ఆడడం నేర్చుకోవాలని సూచించాడు. రెండో ఇన్నింగ్స్ లో పంత్ డకౌట్ అయిన తర్వాత గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. రబడ బౌలింగ్ లో ఔటైన విధానంపై సన్నీ మండిపడ్డాడు. పంత్ చెత్త షాట్ ఆడి ఔటయ్యాడని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. ఇన్నింగ్స్ పరిస్థితి చూసి బాధ్యతాయుతంగా ఆడాలని పంత్ కు సూచించాడు. పుజారా, రహానే ఎంతో ఓపిగ్గా బ్యాటింగ్ చేసిన విధానం చూసిన తర్వాత కూడా పంత్ ఇలాంటి షాట్ ఆడడం సరికాదన్నాడు. టెస్టుల్లో లోయర్ ఆర్డర్ వరకూ వికెట్ కీపర్ పై అంచనాలుంటాయని, పంత్ ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని సూచించాడు.
క్రీజులోకి వచ్చీ రాగానే భారీ షాట్లు ఆడాలనుకోవడం టెస్ట్ ఫార్మేట్ లో సరైన ఆలోచన కాదన్నాడు. రబడ వేసిన షార్ట్ డెలివరీని ఆడబోయి పంత్ వికెట్ సమర్పించుకున్నాడు. టెస్టుల్లో పంత్ తన బ్యాటింగ్ స్టైల్ మార్చుకోవాలని, పరిస్థితులకు తగ్గట్టు ఆడాలని గవాస్కర్ సూచించాడు. ఆస్ట్రేలియాపై చారిత్రక టెస్ట్ సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన పంత్ తర్వాత భారత జట్టులో రెగ్యులర్ వికెట్ కీపర్ గా మారిపోయాడు. అయితే బ్యాటింగ్ పరంగా నిలకడలేమి అతనికి సమస్యగా మారింది. ప్రస్తుత సౌతాఫ్రికాతో సిరీస్ లో పంత్ పెద్దగా రాణించలేదు. ఇప్పటి వరకూ జరిగిన రెండు టెస్టుల్లోనూ కేవలం 59 పరుగులే చేశాడు.
తొలి టెస్టులో 8, 34 పరుగులు చేసిన పంత్ రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 17 , రెండో ఇన్నింగ్స్ లో డకౌడయ్యాడు. సౌతాప్రికా ముందు మంచి టార్గెట్ ఉంచాలనుకుంటున్న సమయంలో పంత్ డకౌటవడం అందరినీ నిరాశపరిచింది,. పంత్ ఔటైన తీరుపైనే గవాస్కర్ తో సహా పలువురు విశ్లేషకులు అసహనం వ్యక్తం చేశారు. మరి మూడో టెస్టులోనైనా ఈ యువ వికెట్ కీపర్ తన బ్యాట్ తో ఆకట్టుకుంటాడేమో చూడాలి.
Related News
IPL 2024: ఢిల్లీకి బిగ్ షాక్.. కెప్టెన్ రిషబ్ పంత్ అవుట్
ఢిల్లీ క్యాపిటల్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఒక మ్యాచ్పై నిషేధానికి గురయ్యాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.30 లక్షల జరిమానా కూడా విధించారు. వివరాలలోకి వెళితే..