సీఎస్కేకు గుడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ ఎంట్రీ!
ఐపీఎల్ 2026లో సీఎస్కే తన తదుపరి మ్యాచ్ను ముంబై ఇండియన్స్తో ఆడనుంది. ఈ రెండు జట్ల మధ్య ఎంతో కాలంగా హోరాహోరీ పోరు సాగుతోంది.
- Author : Gopi
Date : 21-04-2026 - 11:09 IST
Published By : Hashtagu Telugu Desk
Spencer Johnson: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభం కాస్త నిరాశాజనకంగా ఉన్నప్పటికీ గత మూడు మ్యాచ్లలో రెండింటిని గెలిచి మళ్లీ ఫామ్లోకి వచ్చింది. ఇప్పుడు సీఎస్కే జట్టు పాత వైభవాన్ని చాటుకునే మూడ్లో కనిపిస్తోంది. త్వరలోనే ఎంఎస్ ధోనీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో మైదానంలోకి దిగుతారని వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో సీఎస్కే జట్టులోకి ఒక కొత్త ఆటగాడు వచ్చి చేరాడు. ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ జట్టుతో కలిశాడు. ఆయన త్వరలోనే మ్యాచ్ ఆడే అవకాశం ఉంది.
నాథన్ ఎల్లిస్ స్థానంలో జాన్సన్
ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ ఎల్లిస్ గాయపడటంతో అతని స్థానంలో స్పెన్సర్ జాన్సన్ను తీసుకుంటున్నట్లు సీఎస్కే గతంలోనే ప్రకటించింది. జాన్సన్ తన గాయం నుండి కోలుకుంటూ ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఏప్రిల్ 20 కల్లా ఆయన జట్టుతో కలుస్తారని వార్తలు వచ్చాయి. అన్నట్లుగానే ఈ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ తాను సీఎస్కే స్క్వాడ్తో చేరినట్లు అభిమానులకు శుభవార్త చెప్పారు. చెన్నైలోని ఎంఎస్ ధోనీకి చెందిన ‘7Padel’ బ్రాండ్లో ఉన్నట్లు ఆయన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు.
Also Read: TGSRTC : రేపటి నుంచి RTC బంద్..ప్రయాణికులకు కష్టాలు తప్పవా ?
ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో అవకాశం దక్కుతుందా?
ఐపీఎల్ 2026లో సీఎస్కే తన తదుపరి మ్యాచ్ను ముంబై ఇండియన్స్తో ఆడనుంది. ఈ రెండు జట్ల మధ్య ఎంతో కాలంగా హోరాహోరీ పోరు సాగుతోంది. ఏప్రిల్ 23న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఇటీవలే సీఎస్కే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ గాయం కారణంగా ఐపీఎల్ 2026 నుండి తప్పుకున్నాడు. జట్టుకు ఒక బలమైన ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అవసరం ఉంది. ఆ లోటును ఇప్పుడు స్పెన్సర్ జాన్సన్ భర్తీ చేయగలడు. జాన్సన్తో పాటు ఎంఎస్ ధోనీ కూడా ఈ మ్యాచ్లో ఆడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.