Rishabh Pant: రిషబ్ పంత్కు ప్రమోషన్.. టీమిండియా కెప్టెన్గా ప్రకటించిన బీసీసీఐ!
ఈ సిరీస్లో యువ ఆటగాళ్లకు అద్భుతంగా రాణించి నేషనల్ టీమ్లో చోటు దక్కించుకోవడానికి సువర్ణావకాశం ఉంటుంది. సౌత్ ఆఫ్రికా-ఎ తో ఆడటం ద్వారా రాహుల్, సిరాజ్, ఆకాశ్దీప్, ప్రసిద్ధ్ కృష్ణలకు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తుంది.
- By Gopichand Published Date - 02:29 PM, Tue - 21 October 25

Rishabh Pant: సౌత్ ఆఫ్రికా-ఎ తో తలపడేందుకు టీమ్ ఇండియాను బీసీసీఐ ప్రకటించింది. నాలుగు రోజుల రెండు మ్యాచ్ల సిరీస్ కోసం రిషబ్ పంత్ (Rishabh Pant) ఫిట్గా మారి జట్టులోకి తిరిగి వచ్చాడు. ఇండియా-ఎ జట్టు కెప్టెన్సీని పంత్కు అప్పగించారు. అలాగే రజత్ పాటిదార్, దేవదత్ పడిక్కల్, ఆయుష్ మ్హత్రే, ఎన్. జగదీశన్లకు జట్టులో చోటు దక్కింది. ఆయుష్ కంబోజ్, యశ్ ఠాకూర్లను కూడా మొదటి మ్యాచ్ కోసం జట్టులో ఉంచారు. ఇక రెండవ నాలుగు రోజుల మ్యాచ్లో ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్ అదరగొట్టనున్నారు.
పంత్ చేతిలో జట్టు పగ్గాలు
సౌత్ ఆఫ్రికా-ఎ తో జరగనున్న రెండు నాలుగు రోజుల మ్యాచ్లకు టీమ్ ఇండియా-ఎను ప్రకటించారు. రిషబ్ పంత్ గాయం నుండి కోలుకున్న తర్వాత ఈ సిరీస్లో బ్యాట్తో మెరిపించనున్నాడు. జట్టు కెప్టెన్సీ కూడా పంత్ చేతికే అప్పగించారు. మొదటి మ్యాచ్ కోసం ఆయుష్ మ్హత్రే, ఎన్. జగదీశన్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్లకు కూడా అవకాశం ఇచ్చారు. అలాగే హర్ష్ దూబే, తనుష్ కొటియన్, అన్షుల్ కంబోజ్, యశ్ ఠాకూర్ లను జట్టులో చేర్చారు. ఆయుష్ బదోనిని కూడా టీమ్లో ఉంచారు.
Also Read: Jal Jeevan Mission : జల్ జీవన్ మిషన్కు కొత్త ఊపును తెచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రెండవ మ్యాచ్లో రాహుల్, సిరాజ్, కృష్ణ భాగం
రెండవ నాలుగు రోజుల మ్యాచ్లో కేఎల్ రాహుల్ కూడా ఆడుతూ కనిపించనున్నాడు. ధ్రువ్ జురెల్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు ఈశ్వరన్ కూడా ఈ మ్యాచ్లో జట్టులో భాగమవుతారు. బౌలింగ్లో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్దీప్ తమ పదునైన బౌలింగ్తో విరుచుకుపడనున్నారు. సిరీస్లోని మొదటి మ్యాచ్ అక్టోబర్ 30 నుండి, రెండవ మ్యాచ్ నవంబర్ 6 నుండి ప్రారంభం కానుంది.
ఈ సిరీస్లో యువ ఆటగాళ్లకు అద్భుతంగా రాణించి నేషనల్ టీమ్లో చోటు దక్కించుకోవడానికి సువర్ణావకాశం ఉంటుంది. సౌత్ ఆఫ్రికా-ఎ తో ఆడటం ద్వారా రాహుల్, సిరాజ్, ఆకాశ్దీప్, ప్రసిద్ధ్ కృష్ణలకు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తుంది. ‘ఎ’ టీమ్ సిరీస్ తర్వాత సౌత్ ఆఫ్రికా ప్రధాన జట్టు భారతదేశంతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లలో తలపడనుంది.