100 Medals Returned : ప్యారిస్ ఒలింపిక్స్ ప్రమాణాలు పతనం.. 100 పతకాలు వాపస్.. ఎందుకు?
ఒలింపిక్ గేమ్స్కు ఉన్న ఇంత మంచి ఇమేజ్ను దెబ్బతీసే కీలక పరిణామం(100 Medals Returned) జరిగింది.
- Author : Pasha
Date : 14-01-2025 - 12:34 IST
Published By : Hashtagu Telugu Desk
100 Medals Returned : ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పోటీలు అంటే.. ఒలింపిక్స్. వీటిని అత్యున్నత ప్రమాణాలతో నిర్వహిస్తారనే భావన అందరికీ ఉంటుంది. వాటి గురించి అందరూ హైరేంజులో ఊహించుకుంటారు. ఒలింపిక్ గేమ్స్కు ఉన్న ఇంత మంచి ఇమేజ్ను దెబ్బతీసే కీలక పరిణామం(100 Medals Returned) జరిగింది. 2024లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్ క్రీడల్లో విజేతలు, రన్నరప్లుగా నిలిచిన వారికి బహూకరించిన మెడల్స్లో నాణ్యత లేదని వెల్లడైంది. దీనిపై ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా వంద మందికిపైగా ఆటగాళ్లు, అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్ నిర్వాహక కమిటీకి ఫిర్యాదు చేశారు. తమకు అందిన పారిస్ ఒలింపిక్ పతకాలు నాసిరకంగా ఉన్నాయని తెలియజేశారు. తమకు ఇచ్చిన నాసిరకం ఒలింపిక్ మెడల్స్ వందమందికిపైగా క్రీడాకారులు వాపస్ ఇచ్చేశారట.
సోషల్ మీడియాలో ఫొటోలతో..
మరికొందరు అథ్లెట్లు తమకు అందిన నాసిరకం ఒలింపిక్ మెడల్స్ ఫొటోలను సోషల్మీడియాలో పోస్టు చేస్తున్నారని తెలిసింది. ఆ ఫొటోల ప్రకారం.. ఒలింపిక్ పతకాలపై ఉండే లోహపు పూత చెదిరిపోయింది.వీటి నాణ్యతను ప్రశ్నిస్తూ అమెరికాకు చెందిన క్రీడాకారుడు స్కేట్ బోర్డర్ హుస్టన్ ప్యారిస్ ఒలింపిక్స్ కమిటీకి కంప్లయింట్ ఇచ్చారట. ఫ్రాన్స్ ప్రభుత్వానికి చెందిన మింట్ మాత్రం ఈ ఆరోపణలు, విమర్శలను ఖండించింది. ఒలింపిక్ మెడల్స్ను మంచి నాణ్యతతో తయారు చేశామని తెలిపింది. లోపాలు ఉన్న ఒలింపిక్ పతకాలను గత ఆగస్టు నెలలోనే మార్చి అందించామని ఫ్రాన్స్ ప్రభుత్వ మింట్ వెల్లడించింది.ఇక ఈ అంశంపై స్పందించిన అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ.. లోపభూయిష్టంగా ఉన్న ఒలింపిక్ పతకాలను మార్చి కొత్తవి ఇస్తామని ప్రకటించింది. కొన్ని వారాల్లోనే దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభిస్తామని వెల్లడించింది.
Also Read :PM Modis Degree Row : ప్రధాని మోడీ డిగ్రీపై మరోసారి కోర్టులో విచారణ.. ఏమిటీ కేసు ?
ఎవరు తయారు చేశారు ? ఎంత ఖర్చయింది ?
- 2024లో జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో 5,084 స్వర్ణ, రజత, కాంస్య పతకాలను అథ్లెట్లకు అందజేశారు.
- విలాసవంతమైన నగలు తయారుచేసే ఫ్రాన్స్ దేశ కంపెనీ ‘చౌమెట్’ ఈ ఒలింపిక్ పతకాలను డిజైన్ చేసింది.
- ఒలింపిక్స్ బంగారు పతకంలో 92.5 శాతం వెండి, 6 గ్రాముల బంగారం ఉంటుంది. దీని తయారీ ఖర్చు దాదాపు రూ.71 వేల దాకా ఉంటుంది.
- రజత పతకంలో మొత్తం వెండి ఉంటుంది. దీని తయారీ ఖర్చు దాదాపు రూ.37 వేలు.
- కాంస్య పతకాన్ని 95 శాతం రాగి, 5 శాతం జింక్తో తయారు చేస్తారు. దీని తయారీ ఖర్చు దాదాపు రూ.500.
- ఈసారి ఒలింపిక్ పతకాల్లో ఈఫిల్ టవర్ నుంచి తీసిన ఉక్కును కూడా వాడారు.
- ది పారిస్ 2024 ఒలింపిక్ గేమ్స్ నిర్వాహక కమిటీ, ఫ్రెంచ్ ప్రభుత్వానికి చెందిన మింట్ (కరెన్సీ ముద్రణ విభాగం)తో కలిసి ఒలింపిక్ పతకాలను తయారు చేయించింది.