David Warner Kids:డాడీ నువ్వెందుకు సెంచరీలు చేయడం లేదు
ఐపీఎల్ 2022 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడుతున్న డేవిడ్ వార్నర్..
- Author : Naresh Kumar
Date : 21-04-2022 - 11:56 IST
Published By : Hashtagu Telugu Desk
ఐపీఎల్ 2022 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడుతున్న డేవిడ్ వార్నర్.. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 30 బంతుల్లో 10 ఫోర్లు , ఒక సిక్స్ సాయంతో అజేయంగా 60 పరుగులు చేసాడు. దాంతో మరో 57 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ లో ఒకే ఫ్రాంఛైజీపై 1000 పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు సాధించాడు. వార్నర్ కంటే ముందు ముంబైఇండియన్స్ సారథి రోహిత్ శర్మ 1018 పరుగులు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు..
ఇక పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ ముగిసాక డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా. రాబోయే మ్యాచుల్లో కూడా ఇలాంటి ఆటతీరే కనబర్చాలి అనుకుంటున్నాను. అయితే రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జొస్ బట్లర్ మాదిరిగా నేనేందుకు సెంచరీలు చేయడం లేదంటూ నా పిల్లలు అడుగుతున్నారు. చిన్న వయసులోనే నా పిల్లలు క్రికెట్ ను అర్థం చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. అని వార్నర్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ వార్నర్ను 6.25 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ సీజన్ లో ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడిన డేవిడ్ వార్నర్ 191 పరుగులు సాధించాడు. అతడిలాగే చెలరేగితే అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ల జాబితాలో కూడా చోటు దక్కించుకుంటాడు. ఇప్పటి వరకూ 154 ఐపీఎల్ మ్యాచ్లాడిన డేవిడ్ వార్నర్ .. 140.37 స్ట్రైక్ రేట్తో 5,640 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 53 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక మరోవైపు జొస్ బట్లర్ ఈ సీజన్ లో ఇప్పటిటివరకు ఆడిన 6 మ్యాచుల్లో రెండు సెంచరీలు, రెండు ఆఫ్ సెంచరీలతో 375 పరుగులు సాధించాడు.. ఈ క్రమంలోనే ఈ సీజన్ లో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు.