కాబోయే భార్యతో గంగా హారతిలో పాల్గొన్న టీమిండియా ప్లేయర్!
రింకూ సింగ్ కాబోయే భార్య ప్రియా సరోజ్ ఉత్తరప్రదేశ్లోని మచ్లిషహర్ లోక్సభ నియోజకవర్గ సమాజ్ వాదీ పార్టీ ఎంపీ. వీరిద్దరూ ఏప్రిల్ 21, మంగళవారం నాడు కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- Author : Gopi
Date : 22-04-2026 - 1:54 IST
Published By : Hashtagu Telugu Desk
Rinku Singh: భారత క్రికెటర్ రింకూ సింగ్ ప్రస్తుతం ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నాడు. రింకూ ఈ సీజన్లో జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. కేకేఆర్ జట్టు ఈ సీజన్లో వరుస ఓటములతో సతమతమైనప్పటికీ 7వ మ్యాచ్లో ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. తదుపరి మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్తో జరగాల్సి ఉండగా ఈ విరామ సమయంలో రింకూ సింగ్ తన కాబోయే భార్య ప్రియా సరోజ్తో కలిసి వారణాసిని సందర్శించారు.
బాబా విశ్వనాథుని దర్శనం, గంగా హారతి
రింకూ సింగ్ కాబోయే భార్య ప్రియా సరోజ్ ఉత్తరప్రదేశ్లోని మచ్లిషహర్ లోక్సభ నియోజకవర్గ సమాజ్ వాదీ పార్టీ ఎంపీ. వీరిద్దరూ ఏప్రిల్ 21, మంగళవారం నాడు కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంగా హారతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘కాశీ, మహాదేవుని భూమి, గంగమ్మ పావన సంగమం’ అని రాసుకొచ్చారు. వీరికి దేవ దీపావళి వేడుకలకు కూడా ఆహ్వానం అందగా, తప్పకుండా వచ్చేందుకు ప్రయత్నిస్తానని రింకూ హామీ ఇచ్చారు.
Also Read: దిల్షాన్ మదుశంక.. రిప్లేస్మెంట్గా వచ్చి రికార్డుల్లోకి!
జూన్ మొదటి వారంలో వివాహం?
రింకూ సింగ్, ప్రియా సరోజ్ ల వివాహం జూన్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. వీరి వివాహ వేడుక వారణాసిలోని ప్రఖ్యాత హోటల్ తాజ్లో జరగవచ్చని సమాచారం. ప్రస్తుతం వారు అదే హోటల్లో బస చేయడంతో పెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకే వారు అక్కడికి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.
రింకూ సింగ్ క్రికెట్ కెరీర్
రింకూ సింగ్ ఇప్పటికే భారత జట్టు తరఫున వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. 45 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడి ఫినిషర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2018 నుండి ఐపీఎల్ ఆడుతున్న రింకూ మొదటి నుండి కేకేఆర్ జట్టులోనే కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో రింకూపై భారీ అంచనాలు ఉన్నాయి.