Jasprit Bumrah : జట్టు గెలిస్తేనే సంతృప్తి : బుమ్రా
తన ప్రదర్శనతో జట్టు గెలిస్తేనే సంతృప్తి అంటున్నాడు భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా. సఫారీ గడ్డపై టెస్ట్ కెరీర్ ప్రారంభించిన బుమ్రా అదే స్టేడియంలో మరోసారి అదిరిపోయే ప్రదర్శన కనబరిచాడు. కేప్ టౌన్ టెస్టులో 5 వికెట్లు పడగొట్టి భారత్ కు ఆధిక్యాన్ని అందించాడు.
- By Hashtag U Published Date - 01:35 PM, Thu - 13 January 22

తన ప్రదర్శనతో జట్టు గెలిస్తేనే సంతృప్తి అంటున్నాడు భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా. సఫారీ గడ్డపై టెస్ట్ కెరీర్ ప్రారంభించిన బుమ్రా అదే స్టేడియంలో మరోసారి అదిరిపోయే ప్రదర్శన కనబరిచాడు. కేప్ టౌన్ టెస్టులో 5 వికెట్లు పడగొట్టి భారత్ కు ఆధిక్యాన్ని అందించాడు. ఈ మ్యాచ్ కు ముందే కేప్ టౌన్ గ్రౌండ్ తో తనకున్న అనుబంధంపై భావోద్వేగ పోస్టు చేసిన బుమ్రా చెప్పినట్టుగానే మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సఫారీ జట్టును 210 పరుగులకే ఆలౌట్ చేయడంలో బుమ్రాదే కీరోల్. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇదే గ్రౌండ్లో 5 వికెట్లు పడగొట్టడం తనకు ప్రత్యేకంగా నిలిచిపోతుందని అన్నాడు. అయితే వ్యక్తిగత ఆట తీరు బాగున్నప్పటికీ అది జట్టు విజయానికి కృషి చేసినప్పుడే సంతోషంగా ఉంటుందని బుమ్రా చెప్పాడు. అందుకే వ్యక్తిగత ప్రదర్శనల కన్న జట్టును గెలిపించడమే తన ధ్యేయమన్నాడు.
ఇదిలా ఉంటే కెప్టెన్ విరాట్ కోహ్లీపై బుమ్రా ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లీ పేస్ బౌలర్లకు అండగా నిలుస్తాడని, నిత్యం వారిలో ఉత్సాహాన్ని నింపుతాడని కొనియాడాడు. అంతేకాకుండా కోహ్లీ సారథ్యంలో ఆడడం చాలా బాగుటుందని చెప్పుకొచ్చాడు. బౌలర్లకే కాకుండా జట్టు మొత్తంలో విరాట్ ఉత్సాహాన్ని నింపుతాడని బుమ్రా తెలిపాడు. ఈ కారణంగానే భారత జట్టు విజయాలు సాధిస్తోందని అభిప్రాయపడ్డాడు. ఒక్కో కెప్టెన్ శైలి ఒక్కోలా ఉంటుందని, అయితే కోహ్లీ మాత్రం జట్టులో ప్రతీ ఒక్కరినీ ప్రోత్సహిస్తాడని బుమ్రా వ్యాఖ్యానించాడు. కేప్ టౌన్ లో టెస్ట్ అరంగేట్రం చేసిన బుమ్రా ఆ మ్యాచ్ లో 4 వికెట్లు పడగొట్టాడు. తాజాగా అలాంటి ప్రదర్శనే రిపీట్ చేస్తూ 5 వికెట్లతో సత్తా చాటాడు. బుమ్రా 5 వికెట్లు పడగొట్టడం ఇది ఏడోసారి. అలాగే కేప్ టౌన్ గ్రౌండ్ లో ఐదు వికెట్లు పడగొట్టిన మూడో భారత బౌలర్ గా రికార్డులకెక్కాడు. గతంలో హర్భజన్ సింగ్ , శ్రీశాంత్ మాత్రమే ఈ ఘనత సాధించారు.