IPL: రసవత్తరంగా ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్
ఐపీఎల్ 16వ సీజన్ లీగ్ స్టేజ్ చివరి దశకు చేరుకుంది. అన్ని జట్లూ 10 మ్యాచ్లు ఆడేయగా.. ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగానే ఉంది. ప్రస్తుతానికి ఏ జట్టూ టోర్నీ నుంచి నిష్క్రమించలేదు. అయితే ప్లే ఆఫ్కు ఖచ్చితంగా చేరుకునే జట్లేవో..
- By Naresh Kumar Published Date - 10:42 PM, Mon - 8 May 23
IPL: ఐపీఎల్ 16వ సీజన్ లీగ్ స్టేజ్ చివరి దశకు చేరుకుంది. అన్ని జట్లూ 10 మ్యాచ్లు ఆడేయగా.. ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగానే ఉంది. ప్రస్తుతానికి ఏ జట్టూ టోర్నీ నుంచి నిష్క్రమించలేదు. అయితే ప్లే ఆఫ్కు ఖచ్చితంగా చేరుకునే జట్లేవో.. ఎవరికి అవకాశాలు ముగిసాయో అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టైటిల్ ఫేవరెట్గా ఉన్న జట్లలో కొన్ని వరుస విజయాలతో దూసుకెళుతుంటే.. మరికొన్ని వెనుకబడ్డాయి. అయితే అన్ని జట్లూ సాంకేతికంగా ప్లే ఆఫ్ రేసులో ఉన్న నేపథ్యంలో ఎవరు టాప్ ఫోర్లో నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్లే ఆఫ్కు ఖచ్చితంగా చేరే జట్లలో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ముందుంది. ఇప్పటికే ఎనిమిది విజయాలు సాధించి టేబుట్ టాపర్గా ఉన్న గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ చేరడం దాదాపు ఖాయమైంది. ఛాంపియన్ హోదాకు తగ్గట్టే అదరగొడుతున్న గుజరాత్ టాప్ ప్లేస్లోనే ప్లే ఆఫ్లో అడుగుపెట్టాలని ఎదురుచూస్తోంది. అటు ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్లో ఒకటిగా ఉన్న చెన్నై సూపర్కింగ్స్ కూడా ప్లే ఆఫ్కు చేరువైంది. తాము ఆడిన చివరి రెండు మ్యాచుల్లో ఓడి, ఒక మ్యాచ్ వర్షార్పణం అయినా కూడా.. ముంబైపై ఘనవిజయం సాధించిన చెన్నై కూడా ప్లేఆఫ్స్ రేసులో చాలా ముందుంది. ప్రస్తుతం ఆరు విజయాలతో , 13 పాయింట్లు సాధించిన ధోనీ సేన పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఏ విధంగా చూసినా గుజరాత్ , చెన్నై ప్లే ఆఫ్ చేరుకోవడం ఖాయమే.
ఇక ప్లే ఆఫ్ రేసులో మిగిలిన రెండు స్థానాలకు మాత్రం గట్టి పోటీ నెలకొంది. లక్నో, బెంగళూరు, ముంబై, పంజాబ్, రాజస్థాన్ జట్లూ పోటీపడుతున్నాయి. వీటితోపాటు ఇంకా కోల్కతా కూడా రేసులోనే ఉంది. ప్రస్తుతం రాజస్థాన్, బెంగళూరు, ముంబై, పంజాబ్ జట్లు పదేసి పాయింట్లతో ఉండగా..నెట్ రన్ రేట్ కారణంగా రాజస్థాన్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. చివరి మూడు మ్యాచ్లలో ఓడిపోవడం రాజస్థాన్ రన్రేట్ను దెబ్బతీశాయి. ప్రస్తుతం వీటిలో ఏ జట్టుకు ప్లే ఆఫ్ చేరే అవకాశం ఎంత శాతం ఉందనే దానిపై లెక్కలు వచ్చాయి. వాటి ప్రకారం ప్లేఆఫ్స్ చేరడానికి లక్నోకు 45 శాతం , బెంగళూరుకు 42 శాతం, ముంబైకి 41 శాతం అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక పంజాబ్కు 39 శాతం ఛాన్సులు ఉన్నాయి. అటు వరుసగా మూడు మ్యాచ్లలో ఓడిన రాజస్థాన్ అవకాశాలు బాగా దెబ్బతిన్నాయి. ఆ జట్టు ప్లే ఆఫ్ చేరడానికి 25 శాతమే అవకాశముంది. మిగిలిన జట్లలో ప్లే ఆఫ్ చేరే అవకాశాలను చూస్తే కోల్కతాకు 14 శాతం, సన్రైజర్స్కు 12 శాతం, పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఢిల్లీకి 11 శాతం ఛాన్సుంది. అనూహ్య ఫలితాలకు వేదికగా నిలిచే ఐపీఎల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. పైగా డూ ఆర్ డై మ్యాచ్లలో పలు జట్లు విజయాలు సాధించిన నేపథ్యంలో ఏ జట్టు అవకాశాలనూ కొట్టిపారేయలేం. రాజస్థాన్పై సన్రైజర్స్ విజయమే దీనికి ఎగ్జాంపుల్. మరి రెండుస్థానాలకు రేసులో ఉన్న 8 జట్లలో అనూహ్య విజయాలతో ఏవి ముందంజ వేస్తాయో వేచి చూడాలి.
Related News
MI vs LSG: నేడు లక్నో వర్సెస్ ముంబై.. విజయంతో ముగించే జట్టు ఏదో..?
IPL 2024 లీగ్ దశ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది.