Super Over In Playoffs: ప్లే ఆఫ్ కొత్త రూల్స్ ఇవే
ఐపీఎల్-2022 ఆఖరి దశకు వచ్చేసింది. ఇప్పటికే ఈ మెగా టోర్నీ లీగ్ దశ మ్యాచులు పూర్తవగా.. మే 24న తొలి క్వాలిఫైయర్-1 మ్యాచ్ జరుగనుంది.
- Author : Naresh Kumar
Date : 24-05-2022 - 1:00 IST
Published By : Hashtagu Telugu Desk
ఐపీఎల్-2022 ఆఖరి దశకు వచ్చేసింది. ఇప్పటికే ఈ మెగా టోర్నీ లీగ్ దశ మ్యాచులు పూర్తవగా.. మే 24న తొలి క్వాలిఫైయర్-1 మ్యాచ్ జరుగనుంది. ఆ తర్వాతి రోజు ఎలిమినేటర్ మ్యాచ్, అనంతరం క్వాలిఫైయర్ 2 మ్యాచ్ జరగనున్నాయి. ఇక మెగా ఫైనల్ మే 29న జరగనుంది. అయితే కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగనున్న క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్లకు వరుణుడు అడ్డుపడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్కు ఫైనల్కు బీసీసీఐ సరికొత్త రూల్స్ తీసుకొచ్చింది… బీసీసీఐ కొత్తగా రూపొందించిన నిబంధనల ప్రకారం ఐపీఎల్ 15వ సీజన్ ప్లే ఆఫ్ మ్యాచ్లు గనుక వర్షం కారణంగా సజావుగా సాగకుంటే సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ విన్నర్ ను తేల్చనున్నారు.
అయితే ఈ సీజన్ ప్లే ఆఫ్స్ లో భాగంగా క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 మ్యాచుల కోసం బీసీసీఐ రిజర్వ్ డేను
కేటాయించలేదు. అయితే ఈ సీజన్ మెగా ఫైనల్కు మాత్రం రిజర్వ్ డేను కేటాయించింది. ఏదైనా కారణాల వల్ల మే29న జరగనున్న మెగా ఫైనల్ మ్యాచ్ జరగకపోతే.. మే 30న ఆ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఒకవేళ రిజర్వ్డే రోజున కూడా కనీసం ఐదు ఓవర్ల ఆట కూడా సాధ్యపడకపోతే పాయింట్ల పట్టికలో ముందున్న జట్టును విన్నర్ గా ప్రకటిస్తారు… అయితే ప్లే ఆఫ్ మ్యాచ్లకు రిజర్వ్ డే కేటాయించలేదు కాబట్టి ఈ మ్యాచ్ల్లో ఒక జట్టు ఇన్నింగ్స్ పూర్తయ్యాక… రెండో ఇన్నింగ్స్ సమయంలో వర్షం అంతరాయం కలిగిస్తే డక్వర్త్-లూయిస్ పద్దతి ప్రకారం విజేతను నిర్ణయిస్తారు.
ఇక ఐపీఎల్ 2022వ సీజన్ ప్లేఆఫ్స్లో భాగంగా తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్ టైటాన్స్ , రాజస్థాన్ రాయల్స్ జట్లు మంగళవారం తొలి క్వాలిఫయర్ లో పోటీపడనుండగా.. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు బుధవారం జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడనున్నాయి.