Team India Quarantine : టీమిండియాకు 3 రోజులు క్వారంటైన్
సౌతాఫ్రికా పర్యటన ముగించుకుని స్వదేశం చేరుకున్న భారత ఆటగాళ్ళు ఇప్పుడే కాస్త రిలాక్సవుతున్నారు
- By Hashtag U Published Date - 12:33 PM, Fri - 28 January 22
సౌతాఫ్రికా పర్యటన ముగించుకుని స్వదేశం చేరుకున్న భారత ఆటగాళ్ళు ఇప్పుడే కాస్త రిలాక్సవుతున్నారు. నాలుగు రోజుల విరామం తర్వాత మళ్ళీ విండీస్ తో సిరీస్ వీరంతా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ను బీసీసీఐ ప్రకటించింది. ఫిబ్రవరి 1న సిరీస్ కు ఎంపికైన ఆటగాళ్ళందరూ అహ్మదాబాద్ లో హాజరవ్వాలని బీసీసీఐ ఆదేశించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టంతా ఫిబ్రవరి 1 నుండి మూడు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి. అనంతరం ప్రాక్టీస్ మొదలుపెడుతుందని బోర్డు వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 6 నుండి వన్డే సిరీస్ ఆరంభం కానుండగా…ప్రతీరోజూ కోవిడ్ టెస్టులు చేయనున్నట్టు బోర్డు తెలిపింది. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఈ సిరీస్ కూడా ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. ఆటగాళ్ళందరూ ప్రతీరోజూ ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాల్సిందే. సిరీస్ కు ముందు లేక మధ్యలో ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ గా తేలితే 7 రోజులు ఐసోలేషన్ లో తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఇరు జట్ల ఆటగాళ్లూ ,సహాయక సిబ్బంది బబూల్ నిబంధనలు పాటించేలా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు బీసీసీఐ తెలిపింది. ఆటగాళ్ళ కుటుంబసభ్యులు కూడా బబూల్ దాటి బయటకు వెళ్ళకుండా ఆంక్షలు అమలు చేస్తోంది. ఫిబ్రవరి 4 , 5 తేదీల్లో టీమ్ కు షార్ట్ ట్రైనింగ్ క్యాంపు ఉంటుందని బోర్డు వర్గాలు వెల్లడించాయి. సౌతాఫ్రికా టూర్ పరాభవం తర్వాత జట్టుపై విమర్శలు వస్తుండడంతో విండీస్ తో సిరీస్ పలువురు ఆటగాళ్ళకు కీలకం కానుంది. దీనికి తోడు ఐపీఎల్ వేలానికి ముందు యువ ఆటగాళ్ళ సత్తాకు కూడా ఈ సిరీస్ పరీక్ష కానుంది. గాయంతో సౌతాఫ్రికా టూర్ నుండి తప్పుకున్న రోహిత్ శర్మ పూర్తి ఫిట్ నెస్ సాధించి విండీస్ తో సిరీస్ కు సిద్ధమయ్యాడు. ఈ సిరీస్ నుండి పూర్తిస్థాయి కెప్టెన్ గా రోహిత్ జట్టు పగ్గాలు అందుకోనున్నాడు. మరోవైపు వెస్టిండీస్ జట్టు కూడా మూడు రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న తర్వాతే ప్రాక్టీస్ మొదలుపెట్టనుంది. ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లాండ్ తో టీ ట్వంటీ సిరీస్ ఆడుతున్న కరేబియన్ టీమ్ ఆదివారం రాత్రికి భారత్ చేరుకునే అవకాశముంది. కోవిడ్ ప్రభావంతో విండీస్ తో సిరీస్ ను రెండు వేదికలకే పరిమితం చేశారు. వన్డే సిరీస్ అహ్మదాబాద్ లో జరగనుండగా… టీ ట్వంటీలకు కోల్ కతా వేదిక కానుంది.
Related News
MI vs LSG: దంచి కొట్టిన రోహిత్.. 10 ఫోర్లు, 3 సిక్సర్లతో విధ్వంసం
ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ 38 బంతుల్లో 68 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. రోహిత్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. అయితే సూర్య, ఇషాన్ కిషన్ నిరాశపరిచారు. హారిక కూడా 16 పరుగులకే వెనుదిరిగాడు.