ENG vs IND: తొలి టీ20లో రోహిత్ సేన ఘన విజయం..!!
ఇంగ్లాండ్ బ్యాటింగ్ ముందు మన బౌలింగ్ నిలబడుతుందా...వాళ్లంతా T20స్పెషలిస్టులు. మన బౌలర్లకు ఇక చుక్కలే...ఇంగ్లాండ్ జట్టు ఫుల్ ఫాంలో ఉంది...వారిపై గెలవడం కష్టం మాటే...ఇదీ ఇంగ్లాండ్ తో తొలి T20కి ముందు వినిపించిన వ్యాఖ్యలు.
- By hashtagu Published Date - 02:36 AM, Fri - 8 July 22

ఇంగ్లాండ్ బ్యాటింగ్ ముందు మన బౌలింగ్ నిలబడుతుందా…వాళ్లంతా T20స్పెషలిస్టులు. మన బౌలర్లకు ఇక చుక్కలే…ఇంగ్లాండ్ జట్టు ఫుల్ ఫాంలో ఉంది…వారిపై గెలవడం కష్టం మాటే…ఇదీ ఇంగ్లాండ్ తో తొలి T20కి ముందు వినిపించిన వ్యాఖ్యలు. కానీ భారతజట్టు అద్భుతం చేసింది. సమిష్టిగా ఆడితే విజయం సాధ్యం కానిదీ ఏదీ లేదని నిరూపించింది. బ్యాజ్ బాల్ ఫార్ములాను బాగా ఒంటబట్టించుకున్నామని…మాదే విజయం అంటూ విర్రవీగిన ఇంగ్లాండ్ కు అసలైన బ్యాజ్ బాల్ ఆట ఎలా ఉంటుందో చూపించింది టీమిండియా.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.ఇంగ్లాండ్ లక్ష్య ఛేదన లో 19.3 ఓవర్లలో148 పరుగులకే వెనుతిరిగింది. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ తోపాటు బౌలింగ్ లోనూ రాణించారు. టీమిండియా విజయంలో పాండ్యా కీలకపాత్ర పోషించాడు. బౌలింగ్ లో రాణించిన హార్ధిక్..బ్యాటింగ్ 33 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు ,1 సిక్సర్ తో రాణించాడు. భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ కు మొదట్నుంచేకష్టాలు ప్రారంభమయ్యాయి. భువనేశ్వర్ ఇంగ్లాండ్ జట్టుకు తొలి ఓవర్లోనే షాకిచ్చాడు. ఆయన వేసిన మొదటి ఓవర్ ఐదో బంతికి భీభత్సమైన ఫాంలోఉన్న బట్లర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
రాణించిన పాండ్యా…
నాలుగో ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా…ఇంగ్లాండ్ కు ఒకే ఓవర్లో డబుల్ షాకిచ్చాడు. రెండో బంతికి డేవిడ్ మలన్ (21)ను బౌల్డ్ చేశాడు. చివరి బంతికి ప్రమాదకర లివింగ్ స్టోన్ కూ డకౌట్ చేశాడు. పాండ్యా తన తర్వాత ఓవర్లో జేసన్ రాయ్ ను కూడా ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ కు కోలుకోలేని దెబ్బ తగలింది. ఫలితంగా ఇంగ్లాండ్ 7 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోగా 45 పరుగులే చేసింది.
హర్షల్ పటేల్ బౌలింగ్ లో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ క్యాచ్ మిస్ చేశాడు. దీంతో బతికిపోయిన హ్యారీ బ్రూక్ 23 బంతుల్లో 28 పరుగులు చేశాడు. బ్రూక్ తో జతకలిసిన మోయిన్ అలీ 20 బంతుల్లో 36 పరుగులు చేశాడు. కొద్దిసేపు వికెట్లను కాపాడాడు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్ కు 61 పరుగులు చేశారు. చాహెల్ వేసిన 13వ ఓవర్లో బ్రూక్ సూర్యకుమార్ యాదవ్ కు క్యాచ్ ఇవ్వడంతో వెనుతిరిగాడు. అదే ఓవర్లో అలీని కూడా పెవిలియన్ బాట పట్టించాడు. 14వ ఓవర్ వేసిన పాండ్యా…ఐదో బంతికి సామ్ కరణ్ ను ఔట్ చేశాడు. ఇది అతడికి ఈ మ్యాచ్ ల నాలుగో వికెట్…16వ ఓవర్ వేసిన హర్షల్ టైమల్ మిల్స్ ను వెనక్కిపంపించాడు. ఫలితంగా టీమిండియా 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.