Virat Kohli: కోహ్లీ@ 14 ఏళ్ళు… ఎమోషనల్ వీడియో
భారత క్రికెట్లో రికార్డుల రారాజు అనగానే గుర్తొచ్చే పేరు సచిన్ టెండూల్కర్... సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మైలురాళ్ళు అందుకున్నాడు.
- By Naresh Kumar Published Date - 11:17 PM, Thu - 18 August 22

భారత క్రికెట్లో రికార్డుల రారాజు అనగానే గుర్తొచ్చే పేరు సచిన్ టెండూల్కర్… సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మైలురాళ్ళు అందుకున్నాడు. సచిన్ తర్వాత ఎవరు ఆ రికార్డులు అధిగమిస్తారో అన్న చర్చకు సమాధానంగా విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇచ్చాడు. మాస్టర్ బ్లాస్టర్ రికార్డుల్లో చాలా వాటిని సక్సెస్పుల్గా అందుకున్న కోహ్లీ తాజాగా అంతర్జాతీయ క్రికెట్లో 14 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ వీడియోను విరాట్ పోస్ట్ చేశాడు. 14 ఏళ్ల కిందట ఇదంతా మొదలైంది. ఇది నాకు దక్కన గౌరవం అంటూ విరాట్ ఈ వీడియోకు క్యాప్షన్ ఉంచాడు. ఈ వీడియోలో తాను ఇండియన్ టీమ్కు ఆడిన తొలినాళ్ల ఫొటోల నుంచి తన కెరీర్లోని మధుర జ్ఞాపకాలను సంబంధించినవి కూడా ఉన్నాయి. 2008, ఆగస్ట్ 18న విరాట్ కోహ్లి భారత్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు.
శ్రీలంకతో జరిగిన వన్డేలో ఓపెనర్గా వచ్చి 22 బాల్స్లో 12 మాత్రమే చేశాడు. ఆ మ్యాచ్లో భారత్ గెలిచింది. తొలి రెండు, మూడేళ్లపాటు టీమ్లో నిలదొక్కుకోవడానికి ఇబ్బంది పడిన కోహ్లి.. ఆ తర్వాత ఒక్కసారిగా చెలరేగిపోయాడు. గడిచిన దశాబ్ద కాలంగా ఇక అతడు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 2008లో అండర్ 19 టీమ్ కెప్టెన్గా వరల్డ్కప్ గెలవడంతో వెలుగులోకి వచ్చిన విరాట్.. అదే ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఈ 14 ఏళ్లలో ఆడిన మూడు ఫార్మాట్లలోనూ ఎన్నో రికార్డులు నమోదు చేశాడు.
కెప్టెన్గానూ సక్సెస్ అందుకున్నాడు. కొన్నాళ్లుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న విరాట్ తిరిగి గాడిలో పడటానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ 14 ఏళ్లలో కోహ్లీ 102 టెస్టులు, 262 వన్డేలు, 99 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 27 సెంచరీలతో 8074 పరుగులు, వన్డేల్లో 43 సెంచరీలతో 12344 పరుగులు, టీ20ల్లో 30 హాఫ్ సెంచరీలతో 3308 పరుగులు చేశాడు. ఐపీఎల్ తర్వాత ఇంగ్లండ్తో సిరీస్లో మాత్రమే ఆడిన విరాట్.. ఇప్పుడు ఆసియా కప్లో ఎంట్రీ ఇస్తున్నాడు. టీ ట్వంటీ ప్రపంచకప్కు ముందు జరగనున్న ఆసియాకప్లో విరాట్ ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.