Murder In School : స్కూల్లో విద్యార్థి కాల్పులు.. ఒకరి మృతి.. ఐదుగురికి గాయాలు
Murder In School : అమెరికాలోని గన్ కల్చర్ మరోసారి హింసకు దారితీసింది.
- Author : Pasha
Date : 05-01-2024 - 7:49 IST
Published By : Hashtagu Telugu Desk
Murder In School : అమెరికాలోని గన్ కల్చర్ మరోసారి హింసకు దారితీసింది. ఈసారి ఏకంగా ఒక స్కూల్లో హింస జరిగి రక్తం పారింది !! శీతాకాల సెలవుల తర్వాత గురువారమే అయోవా రాష్ట్రంలో స్కూల్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. పెర్రీ హైస్కూల్ తెరుచుకోగానే దారుణం జరిగింది. ఆ స్కూల్లో చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థి ఒక షాట్ గన్, ఒక హ్యాండ్ గన్, ఒక ఐఈడీ తీసుకొని వచ్చాడు. కారణం ఏమిటో తెలియదు కానీ.. అతడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురు తోటి విద్యార్థులు కాగా, మరొకరు స్కూల్ నిర్వాహకుడు అని గుర్తించారు. గాయాలపాలైన ఆరో తరగతి విద్యార్థి (12) ఒకరు చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. ఇక ఈ కాల్పులు జరిపిన తర్వాత నిందితుడు కూడా అదే గన్తో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడని తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
స్కూల్ నుంచి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కాల్పులు జరిపిన విద్యార్థి బ్యాగులో ఉన్న ఐఈడీని తీసి నిర్వీర్యం చేశారు. స్కూల్ను తమ కంట్రోల్లోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. గాయాలపాలైన వారిని హుటాహుటిన ఆస్పత్రుల్లో చేర్పించారు. ఈ ఘటన జరిగిన ప్రదేశమంతా రక్తసిక్తంగా కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తులో స్థానిక పోలీసులకు సాయం చేసేందుకు అమెరికా జాతీయ దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ కూడా రంగంలోకి దిగింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు వివరించామని తెెలుపుతూ వైట్ హౌస్ ఓ ప్రకటన(Murder In School) విడుదల చేసింది.
Also Read: DGPs Meet : ఒకే వేదికపైకి 450 మంది డీజీపీలు, ఐజీపీలు.. నేటి నుంచి కీలక భేటీ
అమెరికా ప్రతిష్ఠకు మచ్చ
అమెరికాలోని స్కూళ్లలో తుపాకీ కాల్పులు జరగడం 2018 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఇది 182వ సారి. 2023 సంవత్సరంలో అమెరికాలో సాధారణ పౌరులు తుపాకులతో ఈవిధంగా వీరంగం క్రియేట్ చేసిన ఘటనలు 656 చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలు అమెరికా సమాజంపై, అమెరికా విద్యావ్యవస్థపై మచ్చను క్రియేట్ చేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. 2022 మేలో టెక్సాస్లోని ఉవాల్డేలోని ప్రాథమిక పాఠశాలలో ఒక వ్యక్తి 19 మంది విద్యార్థులను, ఇద్దరు ఉపాధ్యాయులను తుపాకీతో కాల్చి చంపడం కలకలం రేపింది.