Dharani: ధరణి సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!
తెలంగాణలో ధరణి పోర్టల్ సమస్యలపై తుది కసరత్తు, పరిష్కారాల అధ్యయనంపై చీఫ్ సెక్రటరీ, సీఎంఓ ముఖ్యకార్యదర్శి స్మితా సబర్వాల్, రాష్ట్ర ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్ రావు సుదీర్ఘంగా చర్చించారు.
- Author : hashtagu
Date : 14-06-2022 - 12:55 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో ధరణి పోర్టల్ సమస్యలపై తుది కసరత్తు, పరిష్కారాల అధ్యయనంపై చీఫ్ సెక్రటరీ, సీఎంఓ ముఖ్యకార్యదర్శి స్మితా సబర్వాల్, రాష్ట్ర ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్ రావు సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ సర్కార్ తీసుకువచ్చిన ధరణి పోర్టల్లో ఇబ్బందులు తలెత్తిన సంగతి తెలిసిందే. పేర్లలో తప్పులు దొర్లడం. భూవిస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, సర్వే నెంబర్లలో పార్టుల సంబంధిత వివరాల్లో తేడాలు వంటి ప్రధాన సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యల పరిష్కారంపై మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన మంత్రి వర్గ ఉపసంఘం…ధరణి పోర్టల్లో ఉన్న లోపాలపై అధ్యయనం చేస్తోంది. రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి పరిష్కారాలపై కసరత్తు చేసి పోర్టల్లో కొత్త మాడ్యూల్స్ ప్రవేశపెట్టాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే అంశాలపై ఇవాళ చర్చిస్తున్నారు. సాంకేతికంగా ఎదుర్కొంటున్న అంశాలపై కూడా కూలంకషంగా అధికారులతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు మంత్రి హరీశ్ రావు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ఉత్పన్నమయ్యే పరిస్థితిని సమీక్షించాలని మంత్రి ఆదేశించారు.