Bhagya Laxmi Temple : భాగ్యలక్ష్మీ ఆలయానికి వీవీఐపీల తాకిడి.. భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు
- Author : Prasad
Date : 02-07-2022 - 9:59 IST
Published By : Hashtagu Telugu Desk
చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి వీవీఐపీల వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పలువురు బీజేపీ ముఖ్యనేతలు వస్తున్నారు. ఈ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ శనివారం మధ్యాహ్నం ఆలయాన్ని సందర్శించనున్నారు. చార్మినార్ చుట్టుపక్కల దుకాణాల యజమానులు తమ దుకాణాలను మధ్యాహ్నం 3 గంటల వరకు మూసివేయాలని పోలీసులు కోరారు. వీవీఐపీలు వెళ్లే మార్గంలోని పరిసరాలపై నిఘా ఉంచేందుకు చార్మినార్ చుట్టూ ఉన్న పోలీసులు పహారా కాస్తున్నారు. దారి పొడవునా, ప్రముఖులు వెళ్లే దారిలో పోలీసులు మోహరించారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా చార్మినార్ చుట్టూ శనివారం పాతబస్తీలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు కొన్ని వందల మంది పోలీసులను మోహరించారు. చార్మినార్ చుట్టూ ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న భారతీయ జనతా పార్టీ రెండు రోజుల కార్యవర్గ సమావేశం దృష్ట్యా నగరమంతా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.