telangana: చినజీయర్ వివాదాల వెనుక అసలు కారణాలు ఇవి!
తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. రెండు రాజకీయ పార్టీల మధ్య వివాదాలు మామూలే. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా చినజీయర్ స్వామి చుట్టూ వివాదాలు అల్లుకుంటున్నాయి.
- By Hashtag U Published Date - 07:31 PM, Sun - 20 March 22
తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. రెండు రాజకీయ పార్టీల మధ్య వివాదాలు మామూలే. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా చినజీయర్ స్వామి చుట్టూ వివాదాలు అల్లుకుంటున్నాయి. పైగా ఆయన మీడియా ముందుకు వచ్చి వాటిపై వివరణ ఇచ్చుకున్నారు. దీంతో సీన్ మొత్తం మారిపోయింది. ఆదివాసీల విశ్వాసాలపైన, సమ్మక్క-సారక్కలపైన 20 ఏళ్ల కిందట మాట్లాడానని అప్పటి పరిస్థితులను అర్థం చేసుకోవట్లేదన్నది ఆయన ఆరోపణ. కానీ విమర్శకులు ఊరుకోకుండా.. ఆహారపు అలవాట్లపైనా స్వామివారు మాట్లాడారంటూ మరికొన్ని అంశాలను తెరపైకి తెచ్చారు. అసలు ఎప్పుడూ లేనిది ఎందుకు ఇన్ని వివాదాలు ఆయనను చుట్టుముట్టాయి అంటే.. దానికి సమతామూర్తి విగ్రహం విషయం గురించీ చెప్పాలి.
తెలంగాణలోని ముచ్చింతల్ దగ్గర ఏర్పాటు చేసిన రామానుజాచార్యుల విగ్రహానికి సంబంధించిన అంశాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు, స్వామీజీకి మధ్య విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరిగింది. అప్పట్లో.. ఈ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి సీఎం కేసీఆరే తొలి వాలంటీర్ అని జీయర్ స్వామి అన్నారు. మరి అలాంటి కేసీఆరే లేకుండా విగ్రహావిష్కరణ జరిగింది. అదిగో అప్పటి నుంచి జీయర్ స్వామి చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. రామానుజాచార్య విగ్రహ ప్రతిష్ట విషయంలో ఏం జరిగింది? అక్కడి నుంచి చినజీయర్ స్వామివారి విషయంలో వివాదాలు పెరిగాయా? నిజానికి 1000 ఏళ్ల కిందటే దైవాన్ని అందరికీ దగ్గర చేయడంలో రామానుజాచార్యుల ప్రయత్నాన్నీ ఎవరూ కాదనలేరు. అప్పుడే ఆయన అందరికీ సమతా దృక్పథాన్ని బోధించారు. సమసమాజం కోసం రామానుజాచార్యులవారు కృషి చేశారు. సమతామూర్తి విగ్రహావిష్కరణకు.. అక్కడి కార్యక్రమాలకు అధికారంలో ఉన్నవారు వచ్చినప్పుడు, కీలక నేతలు వచ్చినప్పుడు వారికి గౌరవమర్యాదలు ఇవ్వాల్సిందే. వారి విలువైన సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి కావలసిన ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రధానమంత్రి వచ్చిన ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన శిలాఫలకంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు లేదు. అక్కడ మొదలైంది.. అసలు వివాదం.
సీఎం కేసీఆర్ పేరు లేకపోవడంపై చినజీయర్ స్వామి చెప్పిన వెర్షన్ ఏమిటంటే.. ప్రధానమంత్రి కార్యాలయం సూచించిన మేరకే శిలాఫలకం తయారుచేశామని. నిజానికి ఈ ప్రోగ్రామ్ కు ప్రధానమంత్రి కార్యాలయానికి, సంబంధం లేదు. ప్రధాని మోదీ కేవలం అతిథిగానే వచ్చారు. అయినా అతిథిగా వచ్చేవారు కార్యక్రమం ఎలా ఉండాలో నిర్ణయిస్తారా.. ఇక ఇది ప్రధానమంత్రి వచ్చిన ప్రోగ్రామ్ కదా.. దానికి ప్రోటోకాల్ ఉంటుంది కదా అని అనవచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకే ప్రోటోకాల్ ఉంటుంది. ప్రైవేటు కార్యక్రమాలకు ఉండదు. అందులోనూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రసక్తే లేదు. ఇక్కడ శిలాఫలకంపై సీఎం కేసీఆర్ పేరు లేకపోవడంపై చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. చినజీయర్ స్వామి చెప్పిన వివరాల ప్రకారం.. పీఎంఓ సూచన మేరకే సీఎం పేరును శిలాఫలకంలో పెట్టలేదు అని అనుకుంటే.. అప్పుడు సీఎం ఆ కార్యక్రమానికి రారు కదా. కానీ ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి వలంటీర్ అని అంతకుముందే చెప్పారు. మరి తొలి వలంటీర్ పేరు ఎందుకు పెట్టలేదు. పోనీ సీఎం రారు అని తెలిసీ శిలాఫలకం మీద పేరు పెట్టలేదు అని అనుకున్నా.. కేసీఆర్ రారు అన్న విషయం అందరికీ చాలా ఆలస్యంగా తెలిసింది. కానీ శిలాఫలకం అంతకుముందే సిద్ధమవుతుంది కదా. ఇక్కడ మరో పాయింట్ ని కూడా మర్చిపోకూడదు. ఆ కార్యక్రమం ప్రారంభానికి ఒక్క రోజు ముందు సీఎం కేసీఆర్ స్వయంగా అక్కడికి వెళ్లి ఏర్పాట్లను సమీక్షించారు. అలాంటప్పుడు అనవసరంగా రాజకీయ వివాదాలు చెలరేగడానికి కారణమేంటి?
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రారంభోత్సవాలు, ఇతర అంశాల విషయంలో రాజకీయ నాయకుల ఎంట్రీ తక్కువగా ఉంటుంది. ఒకవేళ పిలిచినా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే వివాదాలు చుట్టుముడతాయి. అందుకే సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, ఆరోపణలకు సంబంధించి స్వామీజీయే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ముచ్చింతల్ లో సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన కార్యక్రమంలో అధికారపక్ష నేతలే వచ్చారు. అది కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందే జరిగింది. ఎక్కడా ప్రతిపక్ష నేతలు కనపడలేదు. ఇక తమకు అధికారపక్షం, ప్రతిపక్షం అన్న తేడా లేదని స్వామీజీ అంటారు. కానీ ఆ కార్యక్రమంలో ఎక్కడా ప్రతిపక్షం వాళ్లు కనపడలేదు. మరి వారిని పిలిచారా..లేక పిలిచినా వాళ్లు రాలేదా అన్నది బయటకు రాలేదు. ఇక యాదాద్రి విషయానికి వస్తే.. తమకు ఎవరితోనూ గ్యాప్ లేదని చెప్పేస్తే సరిపోయేది. కానీ తమతో ఎవరికైనా గ్యాప్ ఉంటే తామేమీ చేయలేమంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించడంతో… సందేహాలు అలుముకున్నాయి. అంటే అక్కడ గ్యాప్ ఉందన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పినట్టయ్యింది. దీంతో చినజీయర్ స్వామి చుట్టూ వివాదాలు నానాటికీ పెరుగుతున్నాయే కాని తగ్గడం లేదు. మరి ఈ పరిణామాలన్నీ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పు తీసుకువస్తాయో చూడాలి.
Related News
KCR: కాంగ్రెస్ త్వరలో భూస్థాపితం: కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్.ఈ రోజు శుక్రవారం పెద్దపల్లిలోని రామగుండంలో జరిగిన రోడ్షోలో పాల్గొన్న కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రకటించారు.