Suicide : పబ్జీ గేమ్కు బానిసై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
- Author : Prasad
Date : 12-06-2022 - 5:41 IST
Published By : Hashtagu Telugu Desk
మొబైల్లో పబ్జీ గేమ్కు బానిసై ఓ మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. న్యూ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఊటుకూరు ప్రభు(16) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో శనివారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి పబ్ జి ఆడుకున్నాడు. అయితే,గేమ్లో ఓడిపోవడంతో ఇంట్లో వారు అతడిని ఎగతాళి చేశారు. ఈ నేపథ్యంలో అవమానం భరించలేక మరో గదిలో పడుకుంటానని చెప్పి ప్రభు వెళ్లిపోయాడు. అయితే ఉదయం ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో నిద్రలేపేందుకు తండ్రి తలుపులు తెరిచి చూడగా గదిలో ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. కొడుకు ఉరివేసుకుని ఉండటం చూసి తండ్రి చలించిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.