Weather Updates: తెలంగాణలో మండుతున్న ఎండలు..!
- Author : HashtagU Desk
Date : 26-03-2022 - 10:31 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడినం ప్రభావంతో రెండు, మూడు రోజులపాటు వాతావరణం కాస్త చల్లగానే ఉన్నా, ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో 40 నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి చివరి వారం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఎండలు, వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ సూచించారు.
ఇక ఉదయం నుంచి పది గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు బయటకు రావడానికి భయపడిపోతున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కోల్ మైన్స్ ఉన్న ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో బెల్లంపల్లి, మంథని, గోదావరిఖని, కొత్తగూడెం వంటి ప్రాంతాల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. రానున్న రోజుల్లో తూర్పుతెలంగాణలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే వడదెబ్బ మరణాలు నమోదయ్య అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.