BCCI Reward: కుర్రాళ్లకు బీసీసీఐ భారీ నజరానా
అండర్ 19 ప్రపంచ కప్ ను గెలుచుకున్న యువ భారత జట్టుకు బీసీసీఐ నజరానా ప్రకటించింది.
- Author : hashtagu
Date : 06-02-2022 - 9:36 IST
Published By : Hashtagu Telugu Desk
అండర్ 19 ప్రపంచ కప్ ను గెలుచుకున్న యువ భారత జట్టుకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. ఒక్కో ఆటగాడికి 40 లక్షల రూపాయలు నగదు బహుమతి ఇవ్వనున్నట్టు బీసీసీఐ సెక్రటరీ జై షా ట్వీట్ చేశారు. సహాయక సిబ్బందికి 25 లక్షల చొప్పున ప్రకటించారు. ఫైనల్లో కుర్రాళ్ళు అద్భుతంగా పోరాడారని జై షా ప్రశంసించారు. అటు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కూడా యువ ఛాంపియన్స్ కు అభినందనలు తెలిపారు. 40 లక్షలతో వారి ప్రతిభకు వెల కట్టినట్టు కాదని, వారికి చిన్న ప్రోత్సాహం మాత్రమే అంటూ ట్వీట్ చేశారు. చివరి వరకూ అసాధారణ రీతిలో పోరాడి వరల్డ్ కప్ గెలిచారని గంగూలీ ప్రశంసించారు.
భారత్ జట్టు అండర్ 19 వరల్డ్ కప్ గెలవడం ఇది అయిదోసారి. గతంలో 2000, 2008,20012,2018 లలో కూడా యంగ్ ఇండియా ఛాంపియన్ గా నిలిచింది. చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో ట్రోఫీ కైవసం చేసుకుంది. మొదట ఇంగ్లాండ్ ను 189 పరుగులకు కుప్ప కూల్చిన మన జట్టు చేజింగ్ లో తడబడి నిలబడింది. కీలక ఆటగాళ్ళు త్వరగానే ఔట్ అయినా…వైస్ కెప్టెన్ షేక్ రషీద్ అద్భుత హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. ఈ గుంటూరు కుర్రాడు మరోసారి కీలక భాగస్వామ్యం తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.