Rice Export: బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన భారత ప్రభుత్వం
బాస్మతీయేతర బియ్యం ఎగుమతుల (Rice Export)పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ ఆర్డర్ తక్షణమే అమల్లోకి వచ్చింది.
- Author : Gopi
Date : 21-07-2023 - 7:48 IST
Published By : Hashtagu Telugu Desk
Rice Export: బాస్మతీయేతర బియ్యం ఎగుమతుల (Rice Export)పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ ఆర్డర్ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో ఖరీఫ్ పంటలు ముఖ్యంగా వరి పంటకు నష్టం వాటిల్లడంతో ఉత్పత్తి తగ్గుతుందన్న భయంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిషేధం విధించాలని నిర్ణయించింది.
ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. భారత మార్కెట్లో తగిన లభ్యతను నిర్ధారించడానికి, దేశీయ మార్కెట్లో బాస్మతీయేతర బియ్యం ధరలు పెరగకుండా నిరోధించడానికి ఎగుమతి విధానాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై 20 శాతం ఎగుమతి సుంకం నుంచి విముక్తి కల్పిస్తూ తక్షణమే నిషేధం విధించాలని నిర్ణయించారు.
బియ్యం ధరల పెరుగుదల కనిపిస్తోందని ప్రభుత్వమే అంగీకరించింది. రిటైల్ మార్కెట్లో గత ఏడాది కాలంలో బియ్యం ధరలు 11.5 శాతం పెరగ్గా, ఒక్క నెలలోనే మూడు శాతం ఎగబాకాయి. సెప్టెంబర్ 8, 2022న, బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై 20 శాతం ఎగుమతి సుంకం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా దేశీయ మార్కెట్లో లభ్యత పెరగడంతోపాటు ధరలు తగ్గించవచ్చు. అయితే 20 శాతం ఎగుమతి సుంకం తర్వాత కూడా బాస్మతీయేతర బియ్యం ఎగుమతులు పెరిగాయి.
Also Read: Uniform Civil Code : యూసీసీపై కేంద్రం కీలక ప్రకటన.. విధివిధానాల ప్రశ్నే తలెత్తదని వెల్లడి
ప్రపంచ రాజకీయ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు భారీగా పెరగడంతో ఈ పెరుగుదల కనిపించింది. ఎల్ నినో, వరి ఉత్పత్తి చేసే దేశాల్లో చెడు వాతావరణం కూడా విజృంభణకు కారణాలలో ఉన్నాయి. మొత్తం బియ్యం ఎగుమతుల్లో బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులు 25 శాతం. నాన్ బాస్మతీ బియ్యం ఎగుమతిపై నిషేధం దేశంలో ధరలు తగ్గడానికి దోహదపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, బాస్మతీయేతర బియ్యం (పార్ బాయిల్డ్ రైస్), బాస్మతీ బియ్యం ఎగుమతి విధానంలో ఎలాంటి మార్పు లేదు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి సన్న బియ్యం మొత్తం ఎగుమతి 4.2 మిలియన్ల డాలర్లకు చేరువలో ఉంది. అంతకుముందు సంవత్సరంలో ఎగుమతులు 26.2 మిలియన్లు డాలర్లుగా ఉండేది. భారతదేశం ప్రధానంగా థాయ్లాండ్, ఇటలీ, స్పెయిన్, శ్రీలంక, అమెరికాకు సన్న బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది. ఇప్పటికే టమాట, పచ్చిమిర్చీ సహా పలు కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.