Delhi Politics: ఢిల్లీలో చక్రం తిప్పిన బీజేపీ.. ఆప్ వికెట్ డౌన్
ఢిల్లీలో రాబోయే రోజుల్లో మేయర్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సమయంలో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అధికార పార్టీ ఆప్ కు షాక్ ఇస్తూ కౌన్సలర్ ఒకరు బీజేపీలోకి జంప్ అయ్యారు
- Author : Vamsi Chowdary Korata
Date : 24-04-2023 - 1:50 IST
Published By : Hashtagu Telugu Desk
Delhi Politics: ఢిల్లీలో రాబోయే రోజుల్లో మేయర్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సమయంలో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అధికార పార్టీ ఆప్ కు షాక్ ఇస్తూ కౌన్సలర్ ఒకరు బీజేపీలోకి జంప్ అయ్యారు. మేయర్ ఎన్నికల సమయంలో ఇలా జరగడం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. ద్వారకా సి వార్డు కౌన్సిలర్ సునీత మరియు ఆమె భర్త మాజీ కౌన్సిలర్ రాంనివాస్ పహల్వాన్ ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా, పశ్చిమ ఢిల్లీ ఎంపీ పర్వేశ్ వర్మ దంపతులకు సాదర స్వాగతం పలికారు.
రానున్న రోజుల్లో ఇంకా చాలా మంది కౌన్సిలర్లు ఆప్ని వీడి బీజేపీలో చేరతారని పర్వేశ్ వర్మ పేర్కొన్నారు. ఇప్పుడు బీజేపీ కార్పొరేటర్ల సంఖ్య 107కి చేరింది. సునీత, ఆమె భర్త గతంలో బీజేపీలో ఉన్నారు. మునిసిపల్ ఎన్నికలకు ముందు ఇద్దరూ ఆప్లో చేరారు. వీరిద్దరూ సోమవారం తిరిగి బీజేపీలోకి వచ్చారు.
ఆప్ ప్రభుత్వ ఎక్సైజ్ స్కాం, ఇతర అవినీతి ఆరోపణలపై బీజేపీ న్యాయ పోరాటం చేస్తున్నాదని రాష్ట్ర బీజేపీ చీఫ్ సచ్దేవా అన్నారు. ఇక్కడ కార్మికుల సూచనల మేరకు పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో ఆప్లోని కార్యకర్తలకు మాట్లాడే స్వేచ్ఛ లేదు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి ప్రభావితమై ప్రజలు బీజేపీలో చేరుతున్నట్టు వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ తీర్ధం పుచ్చుకున్న కౌన్సలర్ మాట్లాడుతూ… రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, బీజేపీ నుంచి వచ్చిన సంస్కృతి వల్లే తమ కుటుంబం సమాజం కోసం పనిచేస్తోందని అన్నారు. మొదటి నుంచి బీజేపీతో అనుబంధం ఉన్న ఆమె కొన్ని కారణాల వల్ల ఆప్లోకి మారారు. గతంలో కంటే అంకితభావంతో పార్టీ కోసం పని చేస్తానని తెలిపారు సునీత.
Read More: TDP : చంద్రబాబు ఆయుధాలు కోడికత్తి,వివేకా హత్య