Biden Deepfake : ‘‘నాకు ఓటు వేయొద్దు’’.. బైడెన్ ఆడియో క్లిప్ కలకలం
Biden Deepfake : డీప్ ఫేక్ టెక్నాలజీ ఎవరినీ వదలడం లేదు.
- Author : Pasha
Date : 28-01-2024 - 3:06 IST
Published By : Hashtagu Telugu Desk
Biden Deepfake : డీప్ ఫేక్ టెక్నాలజీ ఎవరినీ వదలడం లేదు. చివరకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా దాని బారినపడ్డారు. బైడెన్ గొంతును అనుకరిస్తూ ముందుగానే రికార్డ్ చేసిన ఆడియో క్లిప్స్ ఇటీవల వైరల్గా మారాయి. ఈ సంవత్సరం చివర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రస్తుతం అమెరికాలో ప్రైమరీ పోల్స్ నిర్వహిస్తున్నారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న నేతల్లో బైడెన్ కూడా ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేయొద్దని బైడెన్ ఓటర్లను కోరినట్లు ఉన్న ఒక నకిలీ ఆడియో క్లిప్ను వైరల్ చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ ఆధారంగా సృష్టించిన ఈ డీప్ఫేక్ కాల్స్పై వైట్హౌస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్య పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ వెల్లడించారు. ‘‘తప్పుడు ఫొటోలు, సమాచారం వ్యాప్తిపై తీవ్ర ఆందోళన చెందుతున్నాం. ఈ సమస్య పరిష్కారం దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. దీన్ని కట్టడి చేసే అంశంలో సోషల్ మీడియా కంపెనీలదే కీలక పాత్ర’’ అని ఆయన గుర్తు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
క్రికెట్ గాడ్ సచిన్ డీప్ ఫేక్(Biden Deepfake) వీడియో ఇటీవల విడుదల కావడం కలకలం రేపింది. దీంతో స్వయంగా సచినే జోక్యం చేసుకొని.. ఆ వీడియాలో ఉన్నది తాను కానని చెప్పాల్సి వచ్చింది. ఓ గేమింగ్ యాప్ కోసం సచిన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఉన్న ఆ వీడియో నెట్టింట్ వైరల్ అయింది. చివరకు సచిన్కు కూడా అది చేరింది. ‘స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్’ పేరుతో ఉన్న గేమింగ్ యాప్ తరఫున సచిన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ యాప్తో డబ్బులు ఎలా సంపాదించవచ్చో ఆయన చెబుతున్నట్లుగా వీడియోలో వాయిస్ మార్ఫింగ్ చేశారు. దీనిపై స్పందిస్తూ సచిన్ పెట్టిన ఒక ట్విట్టర్ పోస్టుపై మహారాష్ట్ర సర్కారు స్పందించింది. ఆ వీడియోను తయారు చేసిన సంస్థపై కేసు పెట్టింది. అయితే ఆ గేమింగ్ యాప్ యజమాని వివరాలను పోలీసులు వెల్లడించలేదు.
Also Read :Kasuri Methi : కసూరి మేతి.. కొలెస్ట్రాల్, అపానవాయువు ప్రాబ్లమ్స్కు చెక్
గతంలో నటి రష్మిక మందన, భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీలపైనా డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. తన డీప్ ఫేక్ వీడియోపై స్వయంగా ప్రధాని మోడీ ఒక సమావేశం వేదికగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అనంతరం డీప్ ఫేక్ వీడియోలపై కొరడా ఝుళిపించాలని సోషల్ మీడియా కంపెనీలకు కేంద్ర ఐటీశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది.