TJF: జర్నలిస్ట్ రేవతిపై కేసు ఉపసంహరించుకోవాలి
- Author : Balu J
Date : 19-06-2024 - 11:29 IST
Published By : Hashtagu Telugu Desk
TJF: ప్రజాసమస్యలపై జర్నలిస్టు వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ స్పందిస్తారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ప్రయత్నం చేస్తారని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు పల్లె రవి కుమార్ గౌడ్ అన్నారు. వ్యక్తిగత స్వార్థం లేకుండా కేవలం ప్రజలకు మెరుగైన సేవలు అందాలనే ఉద్దేశ్యమే ఉంటుంది. ఈ కోణంలోనే జర్నలిస్ట్ రేవతి… విద్యుత్ వినియోగదారు (మహిళ) సమస్యను ప్రస్తావించారు. సమస్య తీవ్రతను చెప్పేందుకు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారని అన్నారు.
సమస్యను గుర్తించి పరిష్కారించాల్సిన TGSPDCL జర్నలిస్ట్ రేవతిని టార్గెట్ చేయడమేంటి.? ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తే పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి. సమస్య కారణాలను అన్వేషించి..పునరావృతం కాకుండా చూడాలి. కానీ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపిన జర్నలిస్ట్ రేవతిపై పోలీసు కేసులు విధించటాన్ని తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్(TJF) తీవ్రంగా ఖండిస్తుంది. ఈ విషయంలో జర్నలిస్ట్ రేవతికి TJF మద్దతుగా నిలుస్తున్నది. తక్షణమే రేవతిపై కేసును ఉపసహరించుకోవాలని ప్రభుత్వంతో పాటు రాష్ట్ర డీజీపీని డిమాండ్ చేస్తోంది. ప్రజాపాలన అని పదే పదే చెబుతున్న ప్ప్రభుత్వం ఈ విషయంపై తక్షణమే స్పందించి డీజీపీకి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం అని పల్లె రవికుమార్ అన్నారు.