Handball Championship: మార్చిలో ఆసియా హ్యాండ్బాల్ చాంపియన్షిప్
- Author : Balu J
Date : 14-02-2022 - 10:17 IST
Published By : Hashtagu Telugu Desk
లక్నో: వచ్చే మార్చిలో జరగనున్న ఆసియా మహిళల యూత్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టుకు సన్నాహక శిబిరం ఏర్పాటు చేశామని జాతీయ హ్యాండ్బాల్ ఫెడరేషన్ (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్రావు వెల్లడించారు. ఇందుకోసం ఈనెల 12, 13వ తేదీల్లో ట్రయల్స్ నిర్వహించి 27 మంది క్రీడాకారిణులను శిబిరానికి ఎంపిక చేశామని చెప్పారు. ఈ మెగా టోర్నీ మార్చి 18 నుంచి 27 వరకు కజకిస్థాన్లో జరగనుందని తెలిపారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) అనుమతి తీసుకుని త్వరలోనే క్యాంప్ ప్రారంభిస్తామని జగన్ మోహన్రావు చెప్పారు. ఇక, శిబిరానికి ఎంపికైన ప్లేయర్ల జాబితాలో రాష్ట్రం నుంచి ఎం.కరీనా స్థానం దక్కించుకొంది. ఆమెతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి చేతన, పూజా గుర్జర్, ననిత, నిక్కీ చౌహాన్, దీక్ష, రీతు, రేణు, తనీషా, ఆరాధన, హర్షిత, సౌమ్య మిశ్రా తదితరులు శిబిరానికి ఎంపికయ్యారు. ఈ శిబిరానికి హెడ్ కోచ్గా మోహిందర్ లాల్ (సాయ్), కోచ్గా ఎం.రవి కుమార్ (శాట్స్) నియమితులయ్యారు.