Harish Rao: తెలంగాణలో మరో కొత్త పథకం.. త్వరలో మైనార్టీ బంధు
మైనార్టీలకు ఆర్థిక సాయం అందించే నూతన పథకానికి శ్రీకారం చుట్టబోతోంది.
- By Balu J Published Date - 11:02 AM, Fri - 21 July 23

ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచుతోంది. ఇప్పటికే బీసీ, దళితులకు పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వాలు మైనార్టీలకు పథకం అందించబోతోంది. దీనికి సంబంధించి మంత్రి హరీష్ రావు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని పేద మైనార్టీలకు ఆర్థిక సాయం అందించే నూతన పథకంపై రెండు మూడు రోజుల్లో సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేస్తారని హరీష్ రావు పేర్కొన్నారు. జలవిహార్ లో జరిగిన మైనార్టీ నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారులకే ఈ ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు మంత్రి హరీష్ రావు. మైనార్టీలను సీఎం కేసీఆర్ ఎంతో గౌరవిస్తారని, రెండు పర్యాయాలు మహమూద్ అలీని మంత్రిగా చేశారని చెప్పారు హరీష్ రావు.
హిందువులకు కల్యాణ లక్ష్మి అమలు చేసినట్టే.. మైనార్టీల కోసం షాదీ ముబారక్ అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఇంగ్లిష్ మీడియంతో పాటు ఉర్దూ మీడియం కూడా అందుబాటులో ఉందని చెప్పారు. మైనార్టీ విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లుగా ఎదుగుతున్నారని పేర్కొన్నారు. ఉర్దూ మీడియంలో కూడా నీట్ నిర్వహించాలని అడిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అని తెలిపారు హరీష్ రావు. ఎన్నికల పేరుతో బీజేపీ, కాంగ్రెస్ కొత్త నాటకాలు ఆడుతున్నాయని, ప్రజలు నమ్మవద్దని తెలిపారు.