TTD: శ్రీవారి భక్తులకు మరో శుభవార్త..!
- By HashtagU Desk Published Date - 09:00 AM, Tue - 8 March 22

శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. అసలు మ్యాటర్ ఏంటంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ క్రమంలో తాజాగా టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, మేల్చాట్ వస్త్రం, అభిషేకం, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు నిర్వహిస్తారు.
ఇక కరోనా పరిస్థితుల ముందున్న విధానంలోనే ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్ కొనసాగుతుంది. అదేవిధంగా, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలకు సంబంధించి భక్తులు నేరుగా పాల్గొనే విధానంతో పాటు వర్చువల్ విధానం కూడా కొనసాగుతుంది. వర్చువల్ సేవలను బుక్ చేసుకున్న భక్తులు ఆయా సేవల్లో నేరుగా పాల్గొనే అవకాశం లేదు. వారికి దర్శనం కల్పించడంతోపాటు ప్రసాదాలు అందించడం జరుగుతుంది. అడ్వాన్స్ బుకింగ్లో ఆర్జిత సేవలను బుక్ చేసుకున్న వారిని, ఉదయాస్తమాన సేవ, వింశతి వర్ష దర్శిని సేవలు బుక్ చేసుకున్న వారిని ఏప్రిల్ 1వ తేదీ నుండి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆయా సేవలకు అనుమతిస్తారని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.