Pudimadaka Beach : పూడిమడక బీచ్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. మూడు మృతదేహాలు వెలికితీత
- By Prasad Published Date - 11:35 AM, Sat - 30 July 22

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక బీచ్లో విషాదం నెలకొంది. శుక్రవారం మధ్యాహ్నం సముద్ర స్నానానికి వెళ్లిన ఏడుగురు విద్యార్థులు బంగాళాఖాతంలో మునిగి మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అనకాపల్లిలోని డైట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం పరీక్ష ముగించుకుని బీచ్కు వెళ్లారు. వీరిలో ఏడుగురు స్నానానికి సముద్రంలోకి ప్రవేశించగా, మిగిలిన వారు ఒడ్డునే ఉండిపోయారు. అకస్మాత్తుగా ఒక పెద్ద అల వారిని సముద్రంలోకి లాగింది. ఒడ్డున నిలబడిన ఇతర విద్యార్థులు సహాయం కోసం కేకలు వేశారు. సమీపంలోని మత్స్యకారులు తేజ అనే విద్యార్థిని రక్షించగా వెంటనే అనకాపల్లిలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆస్పత్రికి తరలించారు. . ఇప్పటివరకు మూడు మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన మృతదేహాల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. వెలికితీసిన మృతదేహాలు పవన్, జగదీష్, గణేష్లుగా గుర్తించారు. శుక్రవారం రాత్రి ఒకరి మృతదేహం, శనివారం ఉదయం ఇద్దరిని బయటకు తీశారు. నర్సీపట్నంకు చెందిన పవన్, గోపాలపట్నంకు చెందిన జగదీష్, చూచికొండకు చెందిన గణేష్ మృతి చెందారు. మృతి చెందిన గ్రామాల విద్యార్థుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయాలు అందించాలని అధికారులను ఆదేశించారు.