Who is Sajid Mir : సాజిద్ మీర్ ఎవరు ? పాకిస్తానే చంపింది.. బతికించింది !!
పాక్ ఉగ్రవాది సాజిద్ మీర్(Who is Sajid Mir) 1978లో పాకిస్తాన్లో జన్మించాడు.
- By Pasha Published Date - 01:24 PM, Thu - 8 May 25

Who is Sajid Mir : సాజిద్ మీర్.. కరుడుగట్టిన పాకిస్తానీ ఉగ్రవాది. భారత్ వద్దనున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో సాజిద్ మీర్ పేరుంది. భారత్కు దొరకకుండా ఇతగాడిని దాచేందుకు పాకిస్తాన్ నానా తంటాలు పడుతోంది. బుధవారం ఉదయం ‘ఆపరేషన్ సిందూర్’పై భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈవిషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి తెలిపారు. ‘‘ఉగ్రవాది సాజిద్ మీర్ను రక్షించే ప్రయత్నంలో అతడు చనిపోయాడని పాకిస్తాన్ ప్రభుత్వం తొలుత ప్రకటించింది. ఆ తర్వాత అంతర్జాతీయ ఒత్తిడి పెరగడంతో.. సాజిద్ బతికే ఉన్నాడని పాకిస్తాన్ ఒప్పుకోవాల్సి వచ్చింది. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో ఉగ్రవాదులను భారత్లో నడిపించిన కీలక వ్యక్తులలో సాజిద్ మీర్ ఒకడు’’ అని విక్రమ్ మిస్రి వెల్లడించారు. సాజిద్ మీర్ గురించి మరిన్ని వివరాలను మనం ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :India-Pakistan Tension: ఆపరేషన్ సిందూర్.. ఈ జిల్లాల్లో హై అలర్ట్!
ఉగ్రవాది సాజిద్ మీర్ చిట్టా..
- పాక్ ఉగ్రవాది సాజిద్ మీర్(Who is Sajid Mir) 1978లో పాకిస్తాన్లో జన్మించాడు.
- సాజిద్ మీర్ ఓ వైపు పాకిస్తాన్ సైన్యంలో అధికారి హోదాలో పనిచేస్తూనే.. మరోవైపు పాక్ ఉగ్రవాద సంస్థల కోసం కూడా పనిచేసేవాడట. భారత్లో ఉగ్రదాడుల కోసం పాక్లో జరిగే ప్లానింగ్లో భాగమయ్యేవాడట.
- సాజిద్ 2005లో నకిలీ పాస్పోర్ట్, తప్పుడు పేరుతో భారతదేశాన్ని సందర్శించాడని అంటారు.
- 2008 సంవత్సరం నవంబరు 26న భారత్లోని ముంబైలో 26/11 ఉగ్రదాడులు జరిగాయి. ఈ ఉగ్రదాడుల కోసం పాకిస్తాన్లో నుంచి స్కెచ్ గీసిన టెర్రరిస్టులలో సాజిద్ ఒకడు.
- ఆనాడు ముంబై ఉగ్రదాడుల్లో దాదాపు 170 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ముంబై ఉగ్రదాడులకు సాజిద్ మీర్ను మరో ఉగ్రవాది దావూద్ గిలానీ కలిశాడు. దీంతో దావూద్ గిలానీకి సాజిద్ మీర్ ఒక సలహా ఇచ్చాడు. ‘‘భారత్లో ఉన్నన్ని నాళ్లు నీ పేరును దావూద్ గిలానీ నుంచి డేవిడ్ హెడ్లీగా మార్చుకో. ఆ పేరుతోనే అక్కడ పనులన్నీ చక్కబెట్టు. భారత్లో ముస్లిమేతర అమెరికన్గా నటించు. దానివల్ల నిన్ను ఎవరూ అనుమానించరు’’ అని ఉగ్రవాది దావూద్ గిలానీకి సాజిద్ మీర్ సలహా ఇచ్చారు.
- సాజిద్ మీర్ ఇచ్చిన సలహా మేరకే ఉగ్రవాది దావూద్ గిలానీ .. డేవిడ్ హెడ్లీ అనే పేరుతో ముంబైలోకి ఎంటర్ అయ్యాడు. అమెరికన్లాగా నటించాడు. పోలీసులు, దర్యాప్తు సంస్థలకు అనుమానం రాకుండా ఉగ్రదాడికి అవసరమైన రెక్కీని నిర్వహించాడు. ముంబైలో ఉగ్రదాడికి అనుకూలమైన ప్రాంతాలను గుర్తించాడు.
- మరో కీలకమైన విషయం ఏమిటంటే.. ముంబైలో ఇమిగ్రేషన్ కార్యాలయం తెరవడానికి ఉగ్రవాది దావూద్ గిలానీ అలియాస్ డేవిడ్ హెడ్లీకి సాజిద్ మీర్ రూ.20 లక్షలు (25 వేల డాలర్లు) కూడా ఇచ్చాడని అంటారు.
- 2008లో ముంబై ఉగ్రదాడులు జరిగిన తర్వాత భారత దర్యాప్తు సంస్థలు పై విషయాలన్నీ తెలుసుకున్నాయి. దీంతో పాకిస్తాన్ అలర్ట్ అయింది. స్వయంగా ప్లాస్టిక్ కాస్మెటిక్ సర్జరీ చేయించి అతడి ముఖాన్ని మార్చినట్లు సమాచారం. ఈ సర్జరీ చేయించిన తర్వాతే సాజిద్ మీర్ చనిపోయాడని పాక్ సర్కారు ప్రకటన చేసిందట.
- అమెరికాలోనూ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో సాజిద్ మీర్ పేరును చేర్చారు.
Also Read :Kidney Health: మీకు ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే కిడ్నీల్లో సమస్యలు ఉన్నట్లే!
సాజిద్పై పాకిస్తానే విష ప్రయోగం చేసిందా ?
- ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రే లిస్టులో ఉన్న దేశాలకు అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సాయం అందదు. పాకిస్తాన్ 2018 నుంచి 2022 వరకు గ్రే లిస్టులో కొనసాగింది. దీనివల్ల పాక్ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం జరిగింది.
- ఇకపై FATF గ్రే లిస్టులో తమ దేశం పేరు చేరకుండా ఉండేందుకు పాకిస్తాన్ పెద్ద స్కెచ్ గీసింది. ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చిన కేసులో 2022లో సాజిద్ మీర్ను అరెస్టు చేసింది. అతడిని ఉగ్రవాద నిరోధక కోర్టులో ప్రవేశపెట్టి 15 సంవత్సరాల జైలు శిక్ష వేయించింది.
- సాజిద్ మీర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని 2023లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎదుట అమెరికా, భారతదేశం ప్రతిపాదించాయి. దీన్ని చైనా అడ్డుకుంది.
- తదుపరిగా లాహోర్లోని కోట్ లఖ్పత్ జైలులో ఉండగా సాజిద్ మీర్ను 2023 డిసెంబరులో విషప్రయోగం చేసి ఆస్పత్రికి తరలించారనే వార్తలు వచ్చాయి. మీర్పై ఐక్యరాజ్యసమితి చర్యలు తీసుకోకుండా తప్పించడానికే ఇలా చేసి ఉంటారని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. అతడు ఇంకా బతికే ఉన్నాడని భారత నిఘా వర్గాలు అంటున్నాయి.