UP Polls: యూపీ ఎన్నికల్లో ఆ సమాజం ఎటువైపో..?
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు... శాశ్వత మిత్రులంటూ ఎవరూ ఉండరని అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు ఏ పార్టీ ఏ పార్టీతో జట్టుకడుతుందో...
- By Hashtag U Published Date - 10:00 PM, Mon - 7 February 22
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు… శాశ్వత మిత్రులంటూ ఎవరూ ఉండరని అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు ఏ పార్టీ ఏ పార్టీతో జట్టుకడుతుందో… ఎప్పుడు విడిపోతుందో కూడా తెలీదు. అయితే… ఎన్నికలప్పుడు మాత్రం ఎవరూ ఊహించని పరిణామాలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఇకపోతే పాలిటిక్స్ లో అందులోనూ ఎలక్షన్స్ టైమ్ లో జరిగే కొన్ని అనూహ్య ఘటనలు మొత్తం రాజకీయ పరిణామాలనే మార్చేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో గెలుపు వాకిట్లో ఉన్నవారిని బోల్తాకొట్టిస్తాయి… అసలు పోటీలోనే లేరనుకున్నవారిని విజేతలుగా నిలబెడుతుంటాయి. అసలు విషయానికొస్తే… ప్రస్తుతం యావద్దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో అలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదేనండీ… ‘ఆలిండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ (AIMIM) పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై జరిగిన హత్యాయత్నం సంఘటన. మరి ఈ ఘటన మరికొద్ది రోజుల్లో జరగనున్న ఎలక్షన్స్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనేదే ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. అంతేకాకుండా… ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై రకరకాల అంచనాలు, ఊహాగానాలకు తెరలేపింది. అయితే, మొదటి నుంచి వివాదాలకు కేంద్రబిందువుగా ఉండే పార్టీ కావడంతో… తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో అన్నదే ఇప్పుడు చర్చకు దారితీసింది.
నాటి నుంచి నేటి వరకు…
భాగ్యనగరం కేంద్రంగా… అదేనండీ మన హైదరాబాద్ కేంద్రంగా 1958లో ఆవిర్భవించింది ‘ఆలిండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ (AIMIM)పార్టీ. అలాగే ఈ పార్టీ అనేక దశాబ్దాల పాటు తన రాజకీయాలను హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితం చేసింది. ముస్లిం సమాజానికి రాజకీయ ప్రతినిధిగా, ముస్లింల గొంతుకగా గుర్తింపు తెచ్చుకున్న ఎంఐఎం పార్టీ, గత దశాబ్దకాలంగా దేశంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 2014లో మొదటిసారిగా హైదరాబాద్ వెలుపల మహారాష్ట్రలో రెండు అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుని యావద్దేశం దృష్టిని ఆకర్షించింది ఈ పార్టీ. అయితే ఆ తర్వాత 2015లో బీహార్లో, 2017లో ఉత్తర్ప్రదేశ్ లో శాసన సభ ఎన్నికలకు పోటీ చేసి, ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. కానీ 2020లో బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 5 సీట్లు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఉత్సాహంతో ఆ వెంటనే 2021లో జరిగిన వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ… ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఒకసారి ఆశ్చర్యపరుస్తూ.. మరోసారి కనుమరుగవుతూ పడి లేస్తున్న కెరటంలా సాగుతున్న మజ్లిస్ పార్టీ ప్రయాణంలో… ఇప్పుడు జరుగుతున్న యూపీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆ పార్టీకి అగ్నిపరీక్షలా మారాయనే చెప్పొచ్చు. దేశంలో మిగతా ఏ రాష్ట్రంతో పోల్చినా ఎక్కువ సంఖ్యంలో ముస్లిం జనాభా కలిగిన ఈ రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికిని చాటుకోవడమనేది ఇప్పుడు ఛాలెంజ్గా మారింది. మొత్తం 403 సీట్లున్న ఉత్తర్ ప్రదేశ్ శాసన సభలో… 100 సీట్లకు ఏఐఎంఐఎం పోటీ చేస్తోంది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి నిలబెట్టింది. వీటిలో కనిష్టంగా 20 శాతం నుంచి గరిష్టంగా 65 శాతం వరకు ముస్లిం జనాభా ఉన్న నియోజకవర్గాలున్నాయి. దాదాపు 45 సీట్లలో 50 శాతం కంటే ఎక్కువ ముస్లిం జనాభా ఉంది. ఈ పరిస్థితుల్లో ముస్లిం సమాజం నమ్మకాన్ని పొందగలిగితే సులభంగా గెలిచే అవకాశం ఉంటుంది. అందుకే, యూపీ ఎన్నికల్లో సత్తా చాటాలన్న లక్ష్యంతో తమ అభ్యర్థుల గెలుపు కోసం అసదుద్దీన్ ఓవైసీ నిర్విరామంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో మీరట్, కిథౌర్ ప్రాంతాల్లో ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరిగి వస్తుండగా… ఛజార్సి టోల్ ప్లాజా వద్ద ఆయనపై కాల్పులు జరిగాయి. 4 రౌండ్ల కాల్పులు జరిగినట్లు ఆయన తన సామాజిక మాధ్యమమైన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆ ఘటన నుంచి అదృష్టావశాత్తూ తప్పించుకుని క్షేమంగా ఢిల్లీ చేరుకున్న ఓవైసీ, ఈ దాడి ‘గాడ్సే వారసుల’ పని అని ఆరోపించారు. ‘మోదీ-యోగీ’ సంయుక్తంగా తనపై దాడికి బాధ్యత వహించాలని అసద్ డిమాండ్ చేశారు. కాల్పులకు తెగబడ్డ ఇద్దరు ఉత్తర్ ప్రదేశ్ వాసులను పోలీసులు వెంటనే అరెస్ట్ కూడా చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందిస్తూ జెడ్ కేటగిరీ భద్రతను ఓవైసీ కి కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అయితే 1994 నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా రాజకీయాల్లో ఉన్న తాను ఏనాడూ భద్రత కోరలేదని, తీసుకోలేదని, ఇప్పుడు కూడా అవసరం లేదని మజ్లిస్ చీఫ్ తేల్చి చెప్పేశారు. మొత్తంగా చూస్తే.. ఈ ఘటన రాజకీయ పరంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఈ దాడి ఘటన వెనుక నిజంగా ఎవరున్నారన్నది పోలీసుల విచారణకు వదిలేసినా కూడా… ప్రస్తుతం ఈ సంఘటనను మాత్రం రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నారన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు.
ఎంఐఎం కు దూరంగా ఆ రెండు పార్టీలు…
యూపీ ఎన్నికల్లో ఎలానైనా సరే తమ ఉనికిని చాటుకోవాలని భావిస్తున్న ఎంఐఎం… సెక్యులర్ రాజకీయ పార్టీలుగా పేరున్న సమాజ్వాదీ, బహుజన్ సమాజ్ పార్టీల్లో ఏ ఒక్క పార్టీతోనైనా ఈ ఎన్నికల్లో జట్టుకట్టేందుకు ప్రయత్నించింది. అయితే మజ్లిస్ తో దోస్తీకి ఈ రెండు పార్టీలు సముఖత వ్యత్తం చేయలేదు. కలుపుకోలేదు కూడా. అందుకూ ఒక కారణం లేకపోలేదు. అదేంటంటే.. ముస్లిం బుజ్జగింపు రాజకీయాలతో విసుగెత్తిన హిందూ సమాజాన్ని సమీకృతం చేస్తూ… వాటిని ఓట్లుగా మలచుకుంటున్న బీజేపీ ని చూసిన ఎస్పీ, బీఎస్పీ పార్టీలు… ఎంఐఎం ను దూరం పెట్టాయి. మజ్లిస్ పార్టీని కలుపుకుంటే వచ్చే ముస్లిం ఓటు బ్యాంకు ప్రయోజనం కంటే…. కోల్పోయే హిందూ ఓటు బ్యాంకు ముప్పే ఎక్కువని ఆ పార్టీలు భావించినట్టున్నాయి. మరోవైపు 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 38 సీట్లలో పోటీచేసి, ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన మజ్లిస్ పార్టీతో… ఇప్పుడు పొత్తు ద్వారా ఒనగూరేది లేదన్న భావన ఆ పార్టీల్లో ఉంది. ఉత్తర్ ప్రదేశ్ లో ముస్లింలను తమ ఓటు బ్యాంకుగా చేసుకున్న సమాజ్వాదీ పార్టీ సైతం, ముస్లిం బుజ్జగింపు రాజకీయాలతో జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈసారి పెద్దగా ముస్లింల ఊసెత్తకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇలాంటి సిట్యుయేషన్ లో మతతత్వ పార్టీగా ముద్రపడ్డ ఎంఐఎంతో పొత్తు ఆలోచననే తమ దరికి రానివ్వలేదనేది విశ్లేషకుల మాట.
ఎటూ తేల్చుకోలేక పోతున్న ముస్లిం యువత..
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై దాడి ఘటనకు ముందున్న పరిస్థితులను గమనిస్తే… ముస్లిం ఓటర్లు సందిగ్ధంలో ఉన్నట్టుగా కనిపించింది. మజ్లిస్ అధినేత నిర్వహించే ప్రచార కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ముస్లిం యువత హాజరయ్యేవారు. ఉత్తర్ ప్రదేశ్ లో గతంలో కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత ఎస్పీ, బీఎస్పీలు ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకోవడమే తప్ప, వారి కోసం చేసిందేమీ లేదంటూ అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్న ప్రసంగాలు యువతను బాగా ఆలోచింపజేశాయి. ఇదే సమయంలో మజ్లిస్ పార్టీ కారణంగా బీజేపీకి ఆయాచిత లబ్ది చేకూరుతుందనే ఒపీనియన్ కూడా చాలా మంది ముస్లింలలో ఉంది. ఎంఐఎం పార్టీ ‘ఓట్ కట్టర్’గా మారి… భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ఓట్లను చీల్చుతోందనే విమర్శలున్నాయి. బీహార్ రాష్ట్రంలో 5 సీట్లు గెలుచుకున్న మజ్లిస్ పార్టీ, చాలా చోట్ల ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా ఆర్జేడీ విజయావకాశాలను దారుణంగా దెబ్బతీసింది. ఈ క్రమంలోనే వెస్ట్ బెంగాల్ ముస్లిం సమాజం…. ఏఐఎంఐఎం పార్టీని ఏమాత్రం ఆదరించకపోవడమే కాకుండా… ముస్లిం మత పెద్దలు సైతం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు. ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ లో బీహార్ పరిస్థితిని పునరావృతం చేయొద్దంటూ సమాజ్ వాదీ పార్టీతో పాటు ముస్లిం మతపెద్దలు కోరుతున్నారు. దీంతో ముస్లింలు ఏ గట్టునుండాలో అర్థంకాని అయోమయ పరిస్థితిలో ఉన్నారు.
ఓవైసీ పై దాడి ఎవరికి లాభం…? ఎవరికి నష్టం..?
మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై జరిగిన హత్యాయత్నం ఘటన అనేది అటు భారతీయ జనతా పార్టీకి, ఇటు మజ్లిస్ పార్టీకి.. ఇద్దరికీ లాభమే అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అదెలా అంటే… ఘటన కంటే ముందే ముస్లిం యువత ఎంఐఎం పార్టీ వైపు ఎక్కువ ఆకర్షితులవుతున్న పరిస్థితులుండగా… ఘటన తర్వాత ఏర్పడిన సానుభూతి వలన మరికొన్ని ఓట్లు జత కలిసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ దాడిని తమ సమాజంపై జరిగిన దాడిగా భావిస్తే మాత్రం… మెజారిటీ ముస్లిం సమాజం గంపగుత్తగా అసదుద్దీన్ వెంట నడిచినా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లిం సమాజం నుంచి చీలే ప్రతి ఓటూ బీజేపీకి లాభం చేకూర్చుతుంది. ఈ క్రమంలో ఘటన వెనుక ఎవరి హస్తం ఉన్నా సరే.. లాభం మాత్రం ఇద్దరికీ ఉంటుందనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. మరి ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఏం జరుగుతుందో అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.
Related News
Narendra Modi : ‘ధాకడ్’ ప్రభుత్వం కారణంగా ఇప్పుడు భారతదేశ శత్రువులు వణుకుతున్నారు
కేంద్రంలో 'ధాకడ్' (ధైర్యమైన) ప్రభుత్వం ఉన్నందున ఏదైనా చేయాలనే ఆలోచన చేసే ముందు భారత శత్రువులు ఇప్పుడు వందసార్లు ఆలోచించారని పాకిస్థాన్ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అన్నారు.