Cm Vijay: తమిళనాడు సీఎం విజయ్ మార్క్ పాలన ఇదే
- Author : Vamsi Chowdary Korata
Date : 21-05-2026 - 10:14 IST
Published By : Hashtagu Telugu Desk
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సచివాలయంలో పని సంస్కృతి పూర్తిగా మారుతోంది. ఆయన సమయపాలనను కచ్చితంగా పాటించడం ప్రభుత్వ శాఖలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో పలు విభాగాల్లో ఉద్యోగుల హాజరుపై కఠిన నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. కార్యాలయాల్లో క్రమశిక్షణను పెంపొందించేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
అధికార వర్గాల సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి విజయ్ పదవి చేపట్టినప్పటి నుంచి ప్రతిరోజూ ఉదయం 9:45 నుంచి 10 గంటల మధ్య సచివాలయానికి చేరుకుంటున్నారు. అధికారిక కార్యక్రమాలు ముగించుకుని సాయంత్రం 4:30 లేదా 5 గంటల వరకు కార్యాలయంలోనే ఉంటున్నారు. సీఎం అనుసరిస్తున్న ఈ విధానం ఇతర శాఖల అధికారులను, సిబ్బందిని సైతం అప్రమత్తం చేస్తోంది. పని వేళలు ప్రారంభం కాకముందే ఉద్యోగులందరూ విధుల్లో ఉండేలా పరిపాలన విభాగాలపై ఒత్తిడి పెరుగుతోంది.
ఈ క్రమంలో ఆహార, పౌరసరఫరాల శాఖ మొట్టమొదటగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు ప్రధాన కార్యదర్శి పి.బి. శరవణకుమార్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఉద్యోగులందరూ ఉదయం 9:50 గంటల కల్లా విధులకు హాజరు కావాలి. ఆఫీస్ అసిస్టెంట్లు ఉదయం 9:30 గంటలకే రావాలని స్పష్టం చేశారు. అండర్ సెక్రటరీలు ఉదయం 10 గంటలలోపు హాజరు రిజిస్టర్లను మూసివేసి, నివేదికను అదనపు ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి పంపాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నిబంధనలు పాటించని వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదే తరహా ఆదేశాలు ఇతర శాఖల్లోనూ జారీ అవుతున్నాయని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. పాలనా సామర్థ్యాన్ని, క్రమశిక్షణను మెరుగుపరిచేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
కొంతమంది ఉద్యోగుల నుంచి ఆందోళన
అయితే, ఈ కొత్త నిబంధనలపై కొంతమంది ఉద్యోగుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కామరాజర్ సాలై, మెరీనా రోడ్డు మార్గంలో ప్రయాణించే వారు ఇబ్బందులు పడుతున్నారు. సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో (ఉదయం 9:30 నుంచి 9:45 మధ్య) ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుండటంతో కార్యాలయాలకు సమయానికి చేరుకోవడం కష్టంగా ఉందని వారు వాపోతున్నారు. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎం. కరుణానిధి, జె. జయలలిత, ఎం.కె. స్టాలిన్ వంటి వారు కాస్త ఆలస్యంగా కార్యాలయానికి వచ్చేవారని, అప్పుడు ప్రయాణం సులువుగా ఉండేదని గుర్తుచేస్తున్నారు. అయితే, మెరుగైన పాలన అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ కొత్త క్రమశిక్షణ చర్యలు చేపట్టినట్లు స్పష్టమవుతోంది.