Karnataka Cm Siddaramaiah : మరోసారి చిక్కుల్లో సిద్ధరామయ్య..?
- By Vamsi Chowdary Korata Published Date - 05:30 PM, Wed - 3 December 25
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి చిక్కుల్లో పడ్డారు. గతంలో ఖరీదైన వాచ్ ధరించి.. తీవ్ర విమర్శలతో వార్తల్లో నిలిచిన సిద్ధూ.. తాజాగా మరోసారి మరో ఖరీదైన చేతి గడియారం పెట్టుకుని కనిపించారు. ఇప్పుడు ఇది కాస్తా కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఇంతకీ ఆయన ధరించిన వాచ్ ఏ కంపెనీది. దాని ధర ఎంత. ఇప్పుడు సిద్ధూ వాచ్ ఎందుకు వివాదం అవుతోంది అనే విషయాలు ఈ స్టోరీలో చూద్దాం.
కర్ణాటకలో ముఖ్యమంత్రి సీటు కోసం సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ల మధ్య తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. తాజాగా మరో అంశం కన్నడ రాజకీయాలను కుదిపేస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి.. ప్రముఖ సోషలిస్ట్ ఇమేజ్ కలిగి ఉన్న సిద్ధరామయ్య మరోసారి ఖరీదైన వాచ్ వివాదంలో చిక్కుకున్నారు. గతంలో హుబ్లోట్ కంపెనీ వాచ్తో కన్నడ రాజకీయాల్లో పెను తుఫాను సృష్టించిన సిద్ధూ.. తాజాగా తన చేతికి ఉన్న విలాసవంతమైన కార్టియర్ వాచ్తో మరోసారి వార్తల్లో నిలిచారు.
ఇటీవల డీకే శివకుమార్ తో జరిగిన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ సందర్భంగా ఈ కాస్ట్లీ వాచ్ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇదే సమావేశంలో డీకే శివకుమార్ కూడా కార్టియర్ వాచ్ ధరించి కనిపించడం గమనార్హం. అయితే అందరి దృష్టి మాత్రం సిద్ధరామయ్య చేతికి పెట్టుకున్న వాచ్పై పడింది. ఆయన ధరించిన మోడల్ లార్జ్ సాంటోస్ డి కార్టియర్. ఈ వాచ్ స్వచ్ఛమైన రోజ్ గోల్డ్తో తయారు చేయబడి ఉంటుంది.
ఈ వాచ్ ధర సుమారు రూ.43.20 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వాచ్లోని 18 క్యారెట్ల రోజ్ గోల్డ్ కేస్, బ్రాస్లెట్.. 1904 నాటి ఒరిజినల్ సాంటోస్ డిజైన్ను ప్రతిబింబిస్తోంది. గతంలో 2016లో కూడా కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సిద్ధరామయ్య హుబ్లోట్ వాచ్ విషయంలో ఇలాంటి వివాదాన్నే ఎదుర్కొన్నారు. దాని ధర అప్పట్లోనే రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షలు ఉంటుందని ఆరోపించారు.
పేదల పక్షాన పోరాడే నాయకుడైన సిద్ధరామయ్య.. ఇంతటి ఖరీదైన వాచ్ను ధరించడంపై ప్రతిపక్షాలు అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. ఆ సమయంలో దుబాయ్కి చెందిన తన ఎన్ఆర్ఐ స్నేహితుడు డాక్టర్ గిరీష్ చంద్ర వర్మ బహుమతిగా ఇచ్చిన సెకండ్ హ్యాండ్ వాచ్ అని సిద్ధరామయ్య స్పష్టం చేసినా వివాదం మాత్రం ఆగలేదు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పుడు సిద్ధరామయ్య వాచ్ విషయంలో ఏం చెబుతారు అనేది ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారింది.