Centre vs Southern States : కేంద్రం వర్సెస్ దక్షిణాది రాష్ట్రాలు.. నిధుల కేటాయింపుపై పోరు షురూ
Centre vs Southern States : దేశంలోని దక్షిణాది రాష్ట్రాలు వాటి హక్కులపై పోరాటాన్ని ప్రారంభించాయి.
- By Pasha Published Date - 05:07 PM, Tue - 13 February 24
Centre vs Southern States : దేశంలోని దక్షిణాది రాష్ట్రాలు వాటి హక్కులపై పోరాటాన్ని ప్రారంభించాయి. జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపులతో తీవ్రంగా నష్టపోతున్నామని అవి ఆరోపిస్తున్నాయి. తమ వాదనను ఇకనైనా పట్టించు కోవాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన 16వ ఆర్థిక సంఘానికి గోడును వెళ్లబోసుకుంటున్నాయి. ఇటీవల ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద కర్ణాటక, కేరళ రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలు స్వయంగా ఆందోళనకు దిగడంతో ఈవిషయం జాతీయ మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కింది. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర సర్కారు నిధుల కేటాయింపులపై(Centre vs Southern States) మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.
We’re now on WhatsApp. Click to Join
ఉత్తరాదిలోని మూడు, నాలుగు రాష్ట్రాలకే లాభం
ఎన్కే సింగ్ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం తాజాగా కేంద్ర సర్కారుకు సమర్పించిన నివేదికతో దక్షిణాది రాష్ట్రాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. 2017 నవంబరు 27న ఏర్పాటైన 15వ ఆర్థిక సంఘం 2020 ఏప్రిల్ 1 నుంచి ఆరేళ్ల కాలానికి సిఫార్సులు చేసింది. ఆ సిఫార్సులే 2026 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం గత ఆర్థిక సంఘం ఈ సిఫార్సులు చేసింది.ఎక్కువ జనాభా కలిగిన రాష్ట్రాలకు వారి అవసరాల దృష్ట్యా అధిక నిధులు కేటాయించాలని 15వ ఆర్థిక సంఘం సూచించింది. ఈ నిబంధనను నిధుల కేటాయింపునకు వర్తింపజేస్తే తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు వాదిస్తున్నాయి. జనాభా నియంత్రణలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను సక్సెస్ ఫుల్గా అమలు చేసినందుకు.. జనాభా పెరుగుదలను కంట్రోల్లో ఉంచినందుకు ఇదేనా తమకు దక్కే ఫలితం అని ప్రశ్నిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ కార్యక్రమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. ఫలితంగా దేశంలో సగానికిపైగా జనాభా ఉత్తరాదిలోని మూడు, నాలుగు రాష్ట్రాల్లోనే కేంద్రీకరించబడి ఉంది. ప్రత్యేకించి జనాభా భారీగా ఉన్న ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, బెంగాల్ రాష్ట్రాలకు నిధులు ఎక్కువగా మంజూరయ్యే ఛాన్స్ ఉంటుంది.
Also Read : Smart Phones Survey : భారతీయులకు ఫోన్ ఎందుకు వాడుతున్నారో తెలియదట.. సంచలన నివేదిక
16వ ఆర్థిక సంఘం ఏం చేయబోతోంది ?
2021 జనగణనను ఇంకా నిర్వహించలేదు. దీంతో 16వ ఆర్థిక సంఘం కూడా పాత జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 16వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. దీనికి ఛైర్మన్గా నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియాను నియమించింది. 71 ఏళ్ల పనగడియా నీతి ఆయోగ్ తొలి ఉపాధ్యక్షుడిగా 2015 జనవరి నుంచి 2017 ఆగస్టు వరకు పనిచేశారు. 16వ ఆర్థిక సంఘం చేయబోయే సిఫార్సులను 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు అమలు చేయనున్నారు. ఈ సంఘం 2025 అక్టోబరు 31 నాటికి రాష్ట్రపతికి నివేదిక సమర్పించాలని కేంద్ర సర్కారు గడువు విధించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా పర్యటించి, రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకుని నివేదికను రూపొందిస్తుంది.
ఆర్థిక సంఘం అంటే ఏంటి?
కేంద్రానికి వచ్చే పన్నుల ఆదాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేసేదే ఆర్థిక సంఘం. ఇదొక స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యంగ సంస్థ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 280(1) ప్రకారం దీన్ని రాష్ట్రపతి నియమిస్తారు. కేంద్రం అందించే గ్రాంట్ల పంపిణీ, రాష్ట్రాల ఆర్థిక వనరులను అంచనా వేసి..రాబోయే ఐదేళ్లలో పంచాయతీ వ్యవస్థలకు అదనపు నిధులను సమకూర్చడానికి తీసుకోవాల్సిన చర్యలను ఆర్థిక సంఘం సూచిస్తుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు 41శాతం పన్నులు కేటాయించాలి. వీటిని 2021-22 నుంచి 2025-26 బడ్జెట్ల మధ్య 14 సార్లు విడత వారీగా నిధులు కేటాయిస్తారు. 2024-2025 బడ్జెట్లో మాత్రం ఆర్థిక సంఘం సిఫార్సులను పాటించకుండా కేవలం 35శాతం నిధులను కేంద్ర సర్కారు కేటాయించింది. సెస్సులు, సర్ఛార్జీలు పెరగడం వల్ల పన్నుల వాటాను 10శాతం పెంచారని ఆర్బీఐ ఓ నివేదికలో తెలిపింది.
Related News
KTR : కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమిదే అధికారం : కేటీఆర్
ఈసారి కేంద్రంలో ఇండియా కూటమికి కానీ, ఎన్డీయే కూటమికి గానీ ఆధిక్యం రాదని.. ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమే ఢిల్లీలో అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్(KTR) జోస్యం చెప్పారు.