లాటరీ కింగ్ ఇంట్లో.. మూడు పార్టీలు.. మూడు విజయాలు..
- Author : Vamsi Chowdary Korata
Date : 05-05-2026 - 2:23 IST
Published By : Hashtagu Telugu Desk
తమిళనాడు, పుదుచ్చేరి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కుటుంబం ట్రిపుల్ ధమాకా సాధించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘లాటరీ కింగ్’గా పేరుగాంచిన శాంటియాగో మార్టిన్ కుటుంబ సభ్యులు మూడు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి, మూడు చోట్లా విజయం సాధించడం విశేషం. శాంటియాగో మార్టిన్ భార్య లీమారోజ్ మార్టిన్, అల్లుడు ఆధవ్ అర్జున, కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్ ఈ ఎన్నికల్లో గెలుపొందారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు భారీగా విరాళాలు అందించిన శాంటియాగో మార్టిన్ కుటుంబం, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేసింది.
20 ఏళ్ల తర్వాత లాల్గుడిలో ఏఐఏడీఎంకే గెలుపు
శాంటియాగో మార్టిన్ భార్య లీమారోజ్ మార్టిన్, ఏఐఏడీఎంకే అభ్యర్థిగా లాల్గుడి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. డీఎంకేకు కంచుకోటగా ఉన్న ఈ స్థానాన్ని ఏఐఏడీఎంకే 20 ఏళ్ల తర్వాత తిరిగి కైవసం చేసుకోవడం గమనార్హం. లీమారోజ్.. నటుడు విజయ్ పార్టీ అయిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అభ్యర్థి కేపీ కృష్ణన్పై 2,739 ఓట్ల తేడాతో విజయం సాధించారు. డీఎంకే అభ్యర్థి టి.పరివల్లాల్ 5,230 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2006, 2011, 2016, 2021 ఎన్నికల్లో డీఎంకే ఇక్కడ వరుసగా గెలిచింది. గతంలో 14 ఏళ్ల పాటు ఐజేకే పార్టీలో ఉన్న లీమారోజ్, ఇటీవలే ఏఐఏడీఎంకేలో చేరారు. పార్టీ అధినేత పళనిస్వామి ఆమెను పార్టీ మహిళా విభాగం సంయుక్త కార్యదర్శిగా నియమించారు.
తమిళనాడులో రెండో విజయం.. టీవీకే నుంచి అల్లుడు గెలుపు
మార్టిన్ అల్లుడు, నటుడు విజయ్ పార్టీ టీవీకే ప్రధాన కార్యదర్శి అయిన ఆధవ్ అర్జున, విక్కివాక్కం స్థానం నుంచి భారీ విజయాన్ని నమోదు చేశారు. ఆయన డీఎంకే అభ్యర్థి కార్తీక్ మోహన్పై 17,302 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఏఐఏడీఎంకే అభ్యర్థి విజయకుమార్ ఎస్ఆర్ మూడో స్థానంలో నిలిచారు. గత రెండు ఎన్నికల్లోనూ ఈ స్థానాన్ని డీఎంకేనే గెలుచుకుంది.
పుదుచ్చేరిలోనూ మార్టిన్ కుటుంబం విజయకేతనం
శాంటియాగో మార్టిన్ కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్, పుదుచ్చేరి ఎన్నికల్లో తన సొంత పార్టీ ‘లట్చియ జననాయక కట్చి’ (ఎల్జేకే) నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కామరాజ్ నగర్ నియోజకవర్గంలో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి పీకే దేవదాస్పై 10,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు. గతంలో బీజేపీలో పనిచేసిన జోస్ చార్లెస్, సీట్ల కేటాయింపులో జాప్యం కారణంగా ఆ పార్టీని వీడినట్లు తెలిపారు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంపై తనకు ఇప్పటికీ అభిమానం ఉందని గతంలో ఎన్డీటీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
పుదుచ్చేరికి తాను బయటి వ్యక్తినన్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. తాను ఇప్పుడు పుదుచ్చేరిలోనే నివాసం ఉంటున్నానని, ఈ ప్రాంతాన్ని సింగపూర్, హాంకాంగ్ తరహాలో అభివృద్ధి చేయాలనేది తన లక్ష్యమని వివరించారు. తమ కుటుంబం తమిళనాడు, పుదుచ్చేరి రాజకీయాలను ప్రభావితం చేయాలని చూస్తోందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. “ప్రజల జీవితాలను మార్చడమే నా లక్ష్యం. పుదుచ్చేరి ప్రజలు నన్ను నమ్మవచ్చు” అని ఆయన స్పష్టం చేశారు. మొత్తంగా ఒకే కుటుంబం మూడు వేర్వేరు రాజకీయ వేదికలపై నిలబడి ఏకకాలంలో విజయాలు సాధించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.