Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. పళనిస్వామి మైండ్ గేమ్
- Author : Vamsi Chowdary Korata
Date : 08-05-2026 - 10:24 IST
Published By : Hashtagu Telugu Desk
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు రోజులు గడిచినా ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో, అన్నాడీఎంకేనే తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ధీమా వ్యక్తం చేయడంతో రాజకీయ వర్గాల్లో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి.
నటుడు సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని సాధించలేకపోయింది. దీంతో గత ఆరు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది.
ఈ క్రమంలో, తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా అన్నాడీఎంకే నాయకత్వం వారిని పుదుచ్చేరిలోని ఓ విలాసవంతమైన రిసార్ట్కు తరలించింది. గురువారం రాత్రి పళనిస్వామి అక్కడికి వెళ్లి ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనను అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. “ఓపికతో ఉండండి, మంచి జరుగుతుంది. మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం” అని ఆయన ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చినట్లు సమాచారం. మొత్తం 47 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 28 మంది, ఏఎంఎంకేకు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఈ శిబిరంలో ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు చెన్నైలో డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్ అధ్యక్షతన జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తమ కూటమిలో ఉండి టీవీకేకు మద్దతు పలికిన కాంగ్రెస్ తీరును విమర్శిస్తూ తీర్మానం చేశారు. అలాగే, రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారాన్ని స్టాలిన్కు కట్టబెట్టారు. మెజారిటీ నిరూపించుకున్న ఏ పక్షాన్నైనా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని గవర్నర్ తెలిపినట్లు వార్తలు వస్తుండటంతో తమిళ రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారాయి.