Parliament Monsoon Session : వర్షాకాల సమావేశాల్లో కొత్తగా 8 కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం
Parliament Monsoon Session : మొత్తం 21 రోజుల పాటు కొనసాగనున్న ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఎనిమిది కీలక బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది.
- By Sudheer Published Date - 08:29 PM, Wed - 16 July 25

జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) జరగనున్నాయి. మొత్తం 21 రోజుల పాటు కొనసాగనున్న ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఎనిమిది కీలక బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడి, దానిపై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ చర్యలు, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఇంట్లో వెలుగులోకి వచ్చిన నోట్ల కట్టల వివాదం వంటి అంశాలపై ప్రతిపక్షాలు చర్చను డిమాండ్ చేయనున్నాయి. దీంతో ఈ సమావేశాలు హాట్ హాట్ చర్చలకు వేదికగా మారే అవకాశం ఉంది.
ఈ వర్షాకాల సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనున్న ప్రధాన బిల్లుల్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు (New Income Tax Bill) ఒకటి. ఇది ఇప్పటికే గత సమావేశాల్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపబడిన విషయం తెలిసిందే. 1961లో రూపొందించబడిన పాత ఆదాయపు పన్ను చట్టంలోని క్లిష్టతను తొలగిస్తూ, కొత్త బిల్లు ద్వారా పన్ను విధానాన్ని సరళీకరించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ఏప్రిల్ 1, 2026 నుండి అమలులోకి రానుంది.
TG Govt : తెలంగాణ రాష్ట్ర పాలన కాంగ్రెస్ చేతుల్లో కాదు బీజేపీ చేతుల్లో ఉంది – హరీష్ రావు
అలాగే కొత్త పన్ను బిల్లులో Tax Year అనే కొత్త వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంవత్సరం (FY) మరియు అకౌంటింగ్ సంవత్సరం (AY) విధానానికి బదులుగా, ఆదాయం వచ్చిన ఏడాదిలోనే పన్ను చెల్లించే విధానం అమలు కానుంది. ఉదాహరణకు..2023-24లో ఆర్జించిన ఆదాయానికి 2024-25లో పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఇక ఉండదు. ఆదాయం వచ్చిన ఏడాదిలోనే (Tax Year) పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఫ్రింజ్ బెనిఫిట్ టాక్స్ (FBT) లాంటి పాత నిబంధనలను తొలగించాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ సమావేశాల్లో ఆదాయపు పన్ను బిల్లుతో పాటు మరోపలు బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. వాటిలో నేషనల్ యాంటీ-డోపింగ్ సవరణ బిల్లు, నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, మినరల్స్ అండ్ మైన్స్ సవరణ బిల్లు, ఇండియన్ పోర్ట్స్ బిల్లు వంటి బిల్లులు ఉన్నాయి. మొత్తం ఎనిమిది బిల్లులు చర్చకు రానున్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్థతో పాటు క్రీడల పరిపాలన, గనుల పరిపాలనకు సంబంధించి మార్పులు తీసుకొచ్చే ఈ బిల్లులు కీలకంగా మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశాలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోంది.