Ranas Interrogation: తహవ్వుర్ రాణా విచారణ షురూ.. ఎన్ఐఏ అడిగిన ప్రశ్నలివీ
ముంబైలోని ఎవరైనా స్థానికులు కూడా ఇందుకు సాయం చేశారా ? అనే వివరాలను రాణా(Ranas Interrogation) నుంచి తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు.
- By Pasha Published Date - 03:24 PM, Fri - 11 April 25

Ranas Interrogation: 2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహవ్వుర్ రాణా విచారణ ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రధాన కార్యాలయంలో అతడిని ఇవాళ (శుక్రవారం) ఉదయం నుంచే ప్రశ్నిస్తున్నారు. పలువురు ఎన్ఐఏ ఉన్నతాధికారులు అతడిని కీలక ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ముంబై ఉగ్రదాడిలో రాణా పాత్రతో ముడిపడిన వివరాలను రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. 2008 నవంబరు 26 నుంచి నవంబరు 29 వరకు ముంబైపై ఉగ్రదాడి కోసం నిధులు, ఆయుధాలను ఎవరు ఇచ్చారు ? ఉగ్రవాదులకు ఎవరు శిక్షణ ఇచ్చారు ? ముంబైలోని ఎవరైనా స్థానికులు కూడా ఇందుకు సాయం చేశారా ? అనే వివరాలను రాణా(Ranas Interrogation) నుంచి తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు.
Also Read :Samanthas Remarriage: సమంత రెండో పెళ్లి.. వరుడు ఆయనేనా ?
భారత్లోని పాక్ స్లీపర్ సెల్స్పై ప్రశ్నలు
- ముంబై, బెంగళూరు, తిరువనంతపురం, హైదరాబాద్, శ్రీనగర్, ఢిల్లీ, లక్నో సహా భారత్లోని వివిధ నగరాల్లో ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల స్లీపర్ సెల్స్ సమాచారాన్ని రాణా నుంచి రాబట్టే దిశగా ఎన్ఐఏ అడుగులు వేస్తోంది.
- భారత్లోని ఎవరైనా వ్యాపారులతో రాణాకు లింకులు ఉన్నాయా అనే దానిపైనా ఆరా తీస్తున్నారు.
- ఉగ్రదాడికి ముందు ఉగ్రవాది డేవిడ్ హెడ్లీని ముంబైకి పంపడంలో, అతడి ద్వారా ముంబై నగర సమాచారాన్ని సేకరించడంలో రాణా పాత్రను తేల్చడంపైనా ఎన్ఐఏ అధికారులు ఫోకస్ పెట్టారు.
- ముంబైపై ఉగ్రదాడికి ముందు లష్కరే తైబా ఉగ్రవాది సాజిద్ మిర్ భారత్కు ఎందుకు వచ్చాడు ? అనే దానిపైనా సమాచారాన్ని రాబడుతున్నారు.
- ముంబైలోని వివిధ ప్రాంతాల వీడియోలను స్వయంగా తహవ్వుర్ రాణా తీసి, పాకిస్తాన్ ఆర్మీక పంపాడనే అభియోగాలు ఉన్నాయి. ఇందులో నిజమెంత అనేది ధ్రువీకరించుకునే పనిలో ఎన్ఐఏ ఉంది.
Also Read :YS Sharmila : వైఎస్ భారతికి అండగా వైఎస్ షర్మిల ఎమోషనల్ ట్వీట్
రాణాను ఎక్కడ విచారించాలనేది ఎన్ఐఏ ఇష్టం : మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్
తహవ్వుర్ రాణా విచారణ వేళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాణాను ఏ రాష్ట్రంలో ఉంచి విచారణ చేయాలనే దానిపై తుది నిర్ణయం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), కేంద్ర హోంశాఖదే అని ఆయన పేర్కొన్నారు. ‘‘రాణాను విచారణ కోసం ముంబైకి తీసుకొస్తారా ?’’ అని విలేకరులు ప్రశ్నించగా.. దేవేంద్ర ఫడ్నవిస్ ఈమేరకు సమాధానం ఇచ్చారు. ‘‘రాణా విచారణకు ఏ సహకారం అవసరమైనా ముంబై పోలీసులు అందిస్తారు. మాకు ఏదైనా అప్డేట్ కావాలంటే తప్పకుండా ఎన్ఐఏను సంప్రదిస్తాం. రాణా విచారణపై ఎన్ఐఏనే తుది నిర్ణయం తీసుకుంటుంది’’ అని మహారాష్ట్ర సీఎం స్పష్టం చేశారు.